Telangana SSC Exam Results 2024 : తెలంగాణ పదో తరగతి జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్(Spot-Valuation of TS SSC Examinations 2024) ప్రక్రియ ఇవాళ్టి (ఏప్రిల్ 3) నుంచి షురూ అయిపోయింది. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో వాల్యూయేషన్ నడుస్తుండగా… ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వ పరీక్షల విభాగం. మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చేపట్టింది. సిబ్బంది కొరత రాకుండా చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేలా కార్యాచరణను రూపొందించింది.
తెలంగాణ పదో తరగతి జవాబు మూల్యాంకనం 11 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు సిబ్బంది విధులను నిర్వహిస్తారు. స్పాట్ లో పాల్గొనే సిబ్బంది…. ప్రతిరోజూ ఒక్కరు 40 జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది. ఉదయం షిఫ్ట్ లో 20, సాయంత్రం సెషల్ లో 20 పూర్తి చేస్తారు. ఏప్రిల్ 11వ తేదీతో ఈ స్పాట్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాలను పరిశీలన చేసి… ఫలితాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టనుంది. స్పాట్ విషయంలో పాటించాల్సిన నిబంధనల విషయంలో ఇప్పటికే సిబ్బందికి అవగాహన కార్యక్రమాలను పూర్తి చేశారు.
ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి తెలంగాణ పదో తరగతి ఫలితాలు(Telangana SSC Exam Results) కాస్త ముందుగానే రానున్నాయి. 11వ తేదీతో స్పాట్ పూర్తి కానుండగా…. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి పరీక్షలు తొందరగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023లో ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా… ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగాయి. ఫలితాలను మే 10వ తేదీన ప్రకటించారు. అయితే ఈసారి పరీక్షలు మార్చి 18వ తేదీనే మొదలయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీతో అన్ని ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. గతేడాది షెడ్యూల్ తో పోల్చితే… ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 25 నుంచి 30 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే….. ఏప్రిల్ చివరి వారంలోనే పదో తరగతి ఫలితాలు(Telangana 10th Results 2024) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కుదరకపోతే…. మే ఫస్ట్ వీక్ లో దాదాపుగా ప్రకటించే ఛాన్స్ ఉంటుంది.
ఈ ఏడాది జరగుతున్న పరీక్షల కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.