Munugode Bypoll Tour : టెన్షన్ ఎక్కువైంది.. మునుగోడు టూర్ వెళ్లొద్దాం పదా
Munugode By Election : మునుగోడు ఉపఎన్నిక హడావుడి ఇప్పటికే షురూ అయింది. అయితే ఇక్కడో గమ్మత్తైన విషయం జరుగుతోంది. కొంతమంది నేతలు హాలిడే ట్రిప్ లా మునుగోడు ఎన్నికలను చూస్తున్నారట. ఫుల్ లైట్ గా తీసుకుంటున్నారు పలువురు నేతలు.
మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll)లను అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంటే.. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం తేలిగ్గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీ శ్రేణులతోపాటు వరంగల్(Warangal), కరీంనగర్ రీజియన్లకు చెందిన పలువురు నల్గొండ జిల్లా మునుగోడుకు విహారయాత్రకు వచ్చినట్లుగానే వస్తున్నారు.
టీఆర్ఎస్(TRS) పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. బీజేపీ(BJP), కాంగ్రెస్లు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలను పలు గ్రామాలు, మండలాల్లో దించింది. ప్రచార ఇన్ఛార్జ్లుగా నియమించారు. కొంతమంది నేతలు వ్యవసాయ పనులు, ఇతర పనుల్లో బిజీగా ఉండి రాలేకపోతున్నారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad Bypoll)కు వెళ్లినవారు మాత్రం.. అస్సలు తగ్గేదేలేదని మునుగోడు(Munugode)కు వచ్చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికలో చేసిన ఎంజాయ్ మెంట్ ఇక్కడ కూడా దొరుకుందని మరికొంతమందిని తీసుకుని వస్తున్నారు.
మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లు, పట్టణాలకు దూరంగా కొంత సమయం గడపాలనే కోరికతో మునుగోడును సందర్శించడానికి ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో పాల్గొన్న అనుభవం ఉన్న నేతలు మునుగోడు పర్యటన(Munugode Tour)కు తమతో కలిసి రావాలని, అక్కడ ఎంజాయ్ చేసేందుకు వీలుగా మరికొందరిని ప్రోత్సహిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత HT Teluguతో మాట్లాడారు. 'మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం కోసం మునుగోడును సందర్శించాలని ఎమ్మెల్యేల నుండి ఆదేశాలు వచ్చాయి. మాలో కొందరు హుజూరాబాద్ ఉప ఎన్నికలో పాల్గొన్నారు. స్నేహితులతో టూర్(Tour)లాగా ఉంటుంది. కొంతమందికి కలిపి రూమ్స్ ఇస్తారు. అల్పాహారం చేసి, ఉదయం కొన్ని గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ఆపై బిర్యానీ, మద్యంతో పార్టీని ప్రారంభిస్తాం. ఇది నిజమైన వినోదం.'అని చెప్పారు.
వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేత సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ' మేం ఒక గ్యాంగ్ గా ఏర్పడి వాహనం అద్దెకు తీసుకున్నాం. పార్టీ కేటాయించిన స్థలాన్ని సందర్శించాం. మూడు నుండి నాలుగు గంటల పాటు కరపత్రాలను పంపిణీ చేస్తూ ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతాం. ఆపై ఎంజాయ్ చేసేందుకు మాకు చాలా టైమ్ ఉంటుంది.' అని వెల్లడించారు.
అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం కాస్త వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ అధికార పార్టీలే కావడంతో ఏర్పాట్లు భారీగా చేసినట్టుగా తెలుస్తోంది. స్థానిక నాయకులు పెద్దగా సహకరించరని మునుగోడు వెళ్లిన నేతలు అంటున్నారు. నియోజకవర్గానికి మమ్మల్ని తీసుకెళ్లిన నాయకుడే మా ఖర్చులన్నీ భరిస్తున్నాడని చెబుతున్నారు. ఆయనపై గౌరవంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నామంటున్నారు.