Bandi Sanjay Comments: లిక్కర్ స్కాంలో కవిత వికెట్ ఔట్ - బండి సంజయ్-bjp telangana chief bandi sanjay comments on mlc kavitha over ed notices in liquor case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp Telangana Chief Bandi Sanjay Comments On Mlc Kavitha Over Ed Notices In Liquor Case

Bandi Sanjay Comments: లిక్కర్ స్కాంలో కవిత వికెట్ ఔట్ - బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 08:17 PM IST

bandi sanjay slams brs govt:సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కాబోతోందని.. ఈ స్కాంలో కవిత వికెట్ అవుట్ అంటూ వ్యాఖ్యానించారు.

బండి సంజయ్
బండి సంజయ్

bandi sanjay comments on mlc kavitha: కేసీఆర్ బిడ్డ దొంగ దందాలతో ప్రజలకేం సంబంధమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కవిత దొంగ దందా సొమ్ముతో రుణమాఫీ చేస్తున్నారా?? జీతాలిస్తున్నారా? నిరుద్యోగ భ్రుతి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తలవంచని తెలంగాణ... కేసీఆర్ బిడ్డ దొంగ దందాతో దేశం ముందు తలదించుకునే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు. దొంగ, లంగ దందాలు చేసేవాళ్లను వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కాబోతోందని కామెంట్స్ చేశారు. బుధవారం నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"మహిళల గురించి ఆలోచించి, గౌరవించి, ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించే పార్టీ బీజేపీ. మహిళలు శక్తి స్వరూపులు... దేవతలుగా కొలిచే సంస్క్రుతి మనది. మహిళలు ఇంకా వంట గదికే పరిమితం కావాలనుకోవద్దు. అయినప్పటికీ వంటకే పరిమితమైన వాళ్లెందురో ఒకవైపు కుటుంబాన్ని పోషిస్తూనే... మరోవైపు ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు. వంటలు చేసే యాదమ్మ మోదీగారికే వండి పెట్టింది. గంగమ్మ వంటి వాళ్లు ఈరోజు టీవీల్లో యువతతో పోటీ పడుతున్నారు. తెలంగాణలో మహిళలకు అడుగడుగునా అవమానాలే. ప్రీతి హత్య జరిగితే కేసీఆర్ కొడుకుకు పరామర్శించే టైం లేదు. కానీ సానియా మీర్జా వద్దకు మాత్రం వెళతాడు. నరేంద్రమోదీ మహిళల గొప్పతనాన్ని అమెరికాలో చెప్పారు. బిడ్డలను పెంచేందుకు తనతల్లి పడ్డ బాధలను చెప్పారు. తన తల్లిలాగా మహిళలెవరూ బాధపడొద్దని ఎన్నో చర్యలు తీసుకున్నారు. జల్ జీవన్ మిషన్ కింద 6 కోట్ల మందికి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ప్రధానిగా ఎర్రకోటపై టాయిలెట్ల గురించి మాట్లాడితే ఛాయ్ వాలా ప్రధాని అయితే ఇట్లనే ఉంటుందని ప్రతిపక్షాలు హేళన చేశారు..కానీ స్వచ్ఛ భారత్ కింద 11 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మోదీగారిదే. కట్టెల పొయ్యి కష్టాలు తీర్చాలని 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. గతంలో కిరోసిన్ దీపాలతో బిక్కుబిక్కుమంటున్న ఇండ్లకు సౌభాగ్య స్కీం ద్వారా 2.5 కోట్ల మందికి కరెంట్ కనెక్షన్లు ఇచ్చిన గొప్ప నేత మోదీ. నిలువనీడ లేని 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించిన ఘనత మోదీగారిదే. 25 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు తెరిచి ఆర్దికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నారు. ముద్రా కింద లోన్లు కూడా ఇస్తున్నారు" అని చెప్పారు.

సంస్కృతిని దెబ్బతీశారు…

నరేంద్రమోదీ టైంలోనే కేసీఆర్ సీఎం అయ్యారని.. ఒక్కసారి ఎవరి పాలన బాగుందో బేరీజు వేసుకోవాలని కోరారు బండి సంజయ్. కేసీఆర్ తొలి కేబినెట్ లో ఒక్క మహిళ లేరు.. మహిళా కమిషన్ కూడా లేదని గుర్తు చేశారు. ఆ పార్టీలో మహిళా అధ్యక్షురాలు ఉండదని... ఆ పార్టీలో మహిళ అంటే కవిత ఒక్కరే...బతకమ్మ ఆడాలంటే కవితే. బతుకమ్మ పేరుతో డిస్కోలు ఆడించి తెలంగాణ సంస్క్రుతినే దెబ్బతీసిన వ్యక్తి కవిత అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో బతుకమ్మకే గౌరవం లేకుంటే ఇగ సాధారణ మహిళలకేం గౌరవం ఉంటుందని అన్నారు. బీజేపీ సంస్థాగత పదవుల్లో 30 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు బండి సంజయ్. అట్లయితేనే జాతీయ నాయకత్వం ఆమోదిస్తుందని.. రాష్ట్రపతిగా మహిళను చేశామని చెప్పారు. 8 మంది గవర్నర్లను, నలుగురు సీఎంలను, 11 మంది కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీదే అని వ్యాఖ్యానించారు.

కవిత వికెట్ ఔట్...

"లిక్కర్ స్కాంలో కవిత వికెట్ అవుట్. బీఆర్ఎస్ వికెట్లన్నీ క్లీన్ బౌల్డ్ కాబోతున్నాయి. దొంగ సారా, పత్తాల దందా చేసేటోళ్లను వదిలే ప్రసక్తే లేదు. లిక్కర్ దందా చేస్తూ తెలంగాణ వంచదని అంటోంది... కేసీఆర్ బిడ్డ చేసిన దొంగ దందా వల్ల తెలంగాణ మహిళలు ఇయాళ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ బిడ్డ దొంగ, లంగ దందాలతో ప్రజలకేం సంబంధం? ఆమె దందాలతో సంపాదించే సొమ్ముతో రైతులకు రుణమాఫీ చేస్తుందా? పేదలకు ఇండ్లు కట్టిస్తుందా? నిరుద్యోగ భ్రుతి ఇస్తుందా? ఉద్యోగులకు జీతాలిస్తుందా? ఆమె దందాతో ప్రజలకేం సంబంధం? స్వశక్తితో బాగుపడాలని డ్వాక్రా సంఘాలు పనిచేస్తుంటే... వాళ్లను బెదిరించి, భయపెట్టి రాజకీయ సభలకు తీసుకెళుతన్నారు.. మహిళా సమస్యలపై పోరాడటంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తల ఈ విషయంలో చూపుతున్న తెగువ గ్రేట్. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికి ఉద్యమిస్తున్న మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. మహిళలకు తెలంగాణలో భద్రత లేకుండా పోయింది. ఆరేళ్ల పసిపాప నుండి 60 ఏళ్ల ముసలి మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ గూండాలు బరితెగించి హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించడం లేదు. మహిళలకు అత్యంత గౌరవంతోపాటు వచ్చే ఎన్నికల్లో సముచిత స్థాయిలో టిక్కెట్లు ఇచ్చే పార్టీ బీజేపీ. గెలిచే మహిళా నేతలకు తప్పకుండా టిక్కెట్లు ఇస్తాం" అని హామీనిచ్చారు బండి సంజయ్.

జేపీ అధికారంలోకి రావడానికి మహిళలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. మహిళా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలన్నారు. "ప్రీతి ఘటన విషయంలో మీ పోరాటం భేష్. కేసీఆర్ సర్కార్ ప్రీతి చనిపోతే రూ.10 లక్షల సాయం చేస్తారట... కేసీఆర్ బిడ్డ వాచీకి రూ.20 లక్షలతో కొనుగోలు చేస్తారట... కేసీఆర్ కుక్కకు ఇచ్చే విలువ తెలంగాణలో ప్రజలకు దక్కడం లేదు. కేసీఆర్ పొరపాటున మళ్లీ సీఎం అయితే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసేవాళ్లకు ప్రోత్సహకాలు ఇస్తారేమో. పాతబస్తీలో 30 వేల దొంగ బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు సృష్టించారు. పాతబస్తీ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. పాతబస్తీలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలియడం లేదు. రోహింగ్యాలకు అడ్డా అయ్యింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లు యధేచ్చగా వస్తున్నారు. అందుకే నేను సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తానంటే చాలా మంది విమర్శించారు. ఇప్పుడేమంటారు?" అని బండి సంజయ్ ప్రశ్నించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం