AP ICET ECET Results 2024 : రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 30 ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన విద్యార్థులకు బీటెక్, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీతో బీటెక్, బీఫార్మసీ సెకండియర్ లో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలన మే 30న విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫలితాల విడుదల అనంతరం కౌన్సెలింగ్ తేదీలు వెల్లడించనున్నారు.
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అధికారిక వెబ్సైట్ లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ స్కోర్ కార్డ్ కమ్ ర్యాంకు కార్డును వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. విభాగాల వారీగా స్కోర్, మొత్తం మార్కులు, ర్యాంకులు విడుదల చేయనున్నారు.
ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మే 6న నిర్వహించారు. ఐసెట్ పరీక్షకు 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 18,890 మంది విద్యార్థులు, 29,938 మంది విద్యార్థినిలు పరీక్షకు హాజరయ్యారు.
మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన తరువాత ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో చేరేందుకు ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీఈసెట్ పరీక్షను మే 8న నిర్వహించారు. కెమికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు, సెరామిక్ టెక్నాలజీ, మెటలర్జికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు కల్పిస్తారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం