Kota suicide: రాజస్తాన్ లోని కోటాలో నీట్ కు ప్రిపేర్ అవుతున్న మరో విద్యార్థి ఆత్మహత్య
Published Jun 06, 2024 01:02 PM IST
Kota suicides: రాజస్తాన్ లోని కోటా లో ఐఐటీ, నీట్ లకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. బుధవారం కోటలోని జవహర్ నగర్ ప్రాంతంలో తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్న విద్యార్థిని గత ఏడాది నుంచి నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది.
కోటా లో మరో విద్యార్థిని ఆత్మహత్య
Kota suicides: అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు ప్రిపేర్ అవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్తాన్ లోని కోటా జిల్లాలో చోటుచేసుకుంది. కోటాలో కోచింగ్ కోసం వచ్చిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఈ సంవత్సరం 10 కి చేరాయి.
మధ్యప్రదేశ్ నుంచి..
మధ్యప్రదేశ్ లోని రేవా నుంచి తన తల్లి, సోదరుడితో కలిసి రాజస్తాన్ లోని కోటా కు వచ్చిన ఆ యువతి గత సంవత్సరం నుంచి నీట్ కు ప్రిపేర్ అవుతోంది. కోటలోని జవహర్ నగర్ ప్రాంతంలో తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తోంది. 11వ తరగతి చదువుతున్న ఆమె సోదరుడు కూడా జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. 2024 సంవత్సరం నీట్ ఫలితాలను ఒక రోజు ముందే ప్రకటించారు.
కిటికీ నుంచి కిందకు దూకి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం విద్యార్థిని తల్లి గదిలో నిద్రిస్తోంది. సాయంత్రం 4 గంటల సమయంలో బహుళ అంతస్తుల భవనంలోని తన ఫ్లాట్ కిటికీ నుంచి ఆ యువతి కిందకు దూకింది. చుట్టుపక్కల వారు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.