తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Share Trading Scam: షేర్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసగాళ్ల కొత్త స్కామ్; షేర్లలో లాభాలు తెప్పిస్తాం అంటే నమ్మొద్దు

Share trading scam: షేర్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసగాళ్ల కొత్త స్కామ్; షేర్లలో లాభాలు తెప్పిస్తాం అంటే నమ్మొద్దు

HT Telugu Desk HT Telugu

17 April 2024, 8:25 IST

  • Share trading: ప్రజలను ఆకట్టుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ తో స్కామ్స్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా షేర్స్ ట్రేడింగ్ లో భారీగా లాభాలు వచ్చేలా చేస్తామని ఆశపెడ్తూ, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. వీరి బారిన పడి ముంబైకి చెందిన ఒక వ్యక్తి రూ. 45 లక్షలు పోగొట్టుకున్నాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

Share trading scam: నవీ ముంబైకి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.45.69 లక్షలు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్ లో షేర్స్ ట్రేడింగ్ (Share trading scam) ద్వారా అధిక లాభాలు తెప్పిస్తామని అతడికి సైబర్ నేరగాళ్లు ఆశపెట్టారు.

సోషల్ మీడియా అకౌంట్స్ తో..

సైబర్ నేరగాళ్లు ముందుగా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ర్యాండమ్ గా అందరికీ స్టాక్ మార్కెట్ లో షేర్స్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు తెప్పిస్తామని మెసేజెస్ పెడుతూ ఉంటారు. ఎవరైనా ఆ సందేశాలకు స్పందించి రిప్లై ఇస్తే చాలు. వారిని అధిక లాభాల ఆశ చూపుతారు. షేర్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టాలని ప్రలోభపెట్టి, మంచి రాబడి ఇస్తామని హామీ ఇస్తారు. అలాగే, ముంబైకి చెందిన ఈ బాధితుడిని కూడా వారు సంప్రదించారు. వారిని నమ్మి ఆ 44 ఏళ్ల వ్యక్తి రూ. 45.69 లక్షలు వారు చెప్పిన ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ బాధితుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 14 మధ్య ఆ మొత్తం చెల్లించాడు. ఆ తరువాత, ఆ సైబర్ క్రిమినల్స్ నుంచి మెసేజెస్ రావడం ఆగిపోయింది. లాభాలు వస్తాయనుకుంటే, పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా కోల్పోయాడు. దాంతో, మహారాష్ట్ర సైబర్ క్రైమ్ (cyber crime) పోలీసులను ఆశ్రయించి, వారిపై ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు

బాధితుడి ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు ఐదుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), భారతీయ శిక్షాస్మృతి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఇతర సంబంధిత నిబంధనల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొబైల్ నంబర్లు, సోషల్ మీడియా ఐడీల సాయంతో నిందితులను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గత నెలలో కూడా..

గత నెలలో థానే జిల్లాలో జరిగిన షేర్ ట్రేడింగ్ కుంభకోణాన్ని నవీ ముంబై సైబర్ పోలీసులు ఛేదించారు. మీరా రోడ్డులో నిందితుడు పీయూష్ జవారిలాల్ లోధా (39)ను అరెస్టు చేసిన పోలీసులు, అతడి నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, వివిధ బ్యాంకులకు సంబంధించిన తొమ్మిది ఏటీఎం కార్డులు, రెండు చెక్ బుక్స్, రెండు పాన్ కార్డులు, నాలుగు రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం జనవరి 18 నుంచి ఫిబ్రవరి 29 వరకు తనను రూ.29 లక్షలకు మోసం చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా వేలాది మందిని రూ.64 కోట్లకు పైగా మోసం చేసిన ఇద్దరు మోసగాళ్లను కూడా గురుగ్రామ్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు ల్యాప్ టాప్ లు, 41 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ ప్రియాన్షు దివాన్ తెలిపారు. సిమ్ కార్డుల ద్వారా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) డేటాను పరిశీలించిన తర్వాత వారు దేశవ్యాప్తంగా సుమారు రూ.64.85 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. నిందితులను పింకీ, వికార్, ప్రకాశ్, ధర్మేందర్, సూరజ్, పూజగా గుర్తించారు.

తదుపరి వ్యాసం