Family Star Movie: ఫ్యామిలీ స్టార్ మూవీపై ట్రోల్స్.. సైబర్ క్రైమ్కు కంప్లైంట్.. దిల్రాజు కూడా ఫైర్
Family Star Movie: ఫ్యామిలీ స్టార్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాగే, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ తరుణంలో ఈ విషయంపై సైబర్ క్రైమ్ వద్ద ఫిర్యాదు నమోదైంది. అలాగే, ఈ చిత్రంపై నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై నిర్మాత దిల్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Family Star Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి హైప్తో వచ్చింది. గీతగోవిందం కాంబో రిపీట్ అవడం, పాటలు పాపులర్ అవటంతో ఫ్యామిలీ స్టార్ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, రిలీజ్ అయ్యాక మొదటి నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ విషయంపై మూవీ టీమ్ సిరీయస్గా ఉంది.
సైబర్ క్రైమ్లో ఫిర్యాదు
ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు విజయ్ దేవరకొండ మేనేజర్, ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు. ట్రోలింగ్కు సంబంధించిన స్కీన్ షాట్లు, లింక్లను కూడా సమర్పించారు. వారి ఫిర్యాదు మేరకు కంప్లైట్ రిజిస్టర్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.
కావాలనే కొందరు ఫ్యామిలీ స్టార్ చిత్రంపై నెెగెటివ్ పోస్టులు పెడుతున్నారని, రిలీజ్కు ముందు నుంచే ఇది జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. “సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్లు, కొందరు నెటిజన్లు విజయ్ దేవరకొండను కిందికి లాగాలనే ఉద్దేశంతో ఈ చిత్రంపై నెగెటివ్ పోస్టులు చేస్తున్నారు. సినిమా రిలీజ్ కాక ముందు నుంచే ఇది జరుగుతోంది. ఇలా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి” అని కంప్లైట్ చేశారు విజయ్ మేనేజర్, ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు. ఈ ఫిర్యాదును సైబర్ క్రైమ్ అధికారులు రిజిస్టర్ చేశారు.
దిల్రాజు అసంతృప్తి
సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ గురించి జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై నిర్మాత దిల్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా చూసిన వారు బాగుందని చెబుతుంటే.. కొందరు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తాము మంచి సినిమా చేశామని, నెగెటివ్ ప్రచారం చేయడం సరికాదని దిల్రాజు ఓ టీవీ ఛానెల్తో అన్నారు.
సినిమా నచ్చకపోతే వాళ్ల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తామని, అయితే వేరే వాళ్లు కూడా చూడకుండా ప్రభావితం చేయడం సరికాదని దిల్రాజు చెప్పారు.
మూడు రోజుల వరకు రివ్యూల్లేకుండా..
సినిమా రిలీజైన మూడు రోజుల వరకు రివ్యూలు ఇవ్వకుండా కేరళలోని ఓ కోర్టు సూచనలు ఇచ్చినట్టు తాను ఓ చోట విన్నానని దిల్రాజు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి నిబంధన రావాలని, లేకపోతే నిర్మాతలు సినిమాలు తీయడం చాలా కష్టంగా మారుతుందని ఆయన అన్నారు. కాగా, సినిమా రిలిజైన 48 గంటలోపు రివ్యూలు ఇవ్వొద్దని కేరళ హైకోర్టు ఇటీవల రివ్యూయర్లకు సూచనలు చేసింది. అయితే, తప్పకుండా పాటించాల్సిందేనన్న నిబంధన మాత్రం తీసుకురాలేదు.
ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ, మృణాల్ హీరోహీరోయిన్లుగా నటించగా.. జగపతి బాబు, అభినయ, వెన్నెల కిశోర్, వాసుకీ కీలకపాత్రలు పోషించారు. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్రాజు, శిరీష్ నిర్మాతలుగా ఉన్నారు. గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.15 కోట్లలోపే వసూళ్లు సాధించిందని లెక్కలు బయటికి వస్తున్నాయి.