తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Two Cbse Board Exams: 2025 నుంచి రెండు సార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు!; విధివిధానాలపై కసరత్తు

Two CBSE board exams: 2025 నుంచి రెండు సార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు!; విధివిధానాలపై కసరత్తు

HT Telugu Desk HT Telugu

26 April 2024, 21:33 IST

  • Two CBSE board exams: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)ను కోరింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2025-26 విద్యాసంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)ను కోరింది.

పరీక్షలు ఒత్తిడి తగ్గించడం..

విద్యార్థులపై బోర్డు పరీక్షలు ఒత్తిడి లేకుండా చేయడం, విద్యార్థులకు మరిన్ని అవకాశాలు, ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికను తోసిపుచ్చినట్లు నివేదిక తెలిపింది. సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించడానికి విద్యాశాఖ, సీబీఎస్ఈ మేలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో చర్చలు జరుపుతాయని నివేదిక తెలిపింది.

సీబీఎస్ఈ కసరత్తు

ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ షెడ్యూల్ ను ప్రభావితం చేయకుండా మరో సెట్ బోర్డు పరీక్షలకు అనుగుణంగా అకడమిక్ క్యాలెండర్ ను ఎలా రూపొందించాలనే దానిపై విధివిధానాలను రూపొందించే పనిలో సీబీఎస్ఈ ఉంది. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు ఎలా నిర్వహించాలనే అంశంపై కసరత్తు చేయాలని సీబీఎస్ఈ (CBSE) ని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. దాంతో, బోర్డు సంబంధిత విధివిధానాలను రూపొందించే పనిలో పడింది.

నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్

గత ఏడాది ఆగస్టులో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ (NCF) విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు ఎడిషన్ల బోర్డు పరీక్షలను నిర్వహించాలనే ఆలోచన ఉందని, అయితే విధివిధానాలు ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. అయితే సెమిస్టర్ విధానాన్ని అమలు చేసే యోచన లేదని నివేదిక తెలిపింది. విద్యార్థులు గరిష్ట ప్రయోజనం పొందేలా, బోర్డు పరీక్షలను ఒత్తిడి లేకుండా చేయాలనే లక్ష్యంపై సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది.

విద్యార్థుల ఇష్టం..

కాగా, సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదని గత ఏడాది అక్టోబర్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ‘‘ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆ రెండు పరీక్షలలో వారు ఉత్తమ స్కోరును ఎంచుకోవచ్చు. కానీ అది పూర్తిగా ఐచ్ఛికం, బలవంతం కాదు’’ అని వివరించారు.