తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Akhilesh Yadav : 'ఇండియా' కూటమి నుంచి అఖిలేశ్​​ యాదవ్​ ఔట్​?

Akhilesh Yadav : 'ఇండియా' కూటమి నుంచి అఖిలేశ్​​ యాదవ్​ ఔట్​?

Sharath Chitturi HT Telugu

20 October 2023, 6:06 IST

    • Akhilesh Yadav : ఇండియా కూటమి నుంచి అఖిలేశ్​ యాదవ్​ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి! ఇందుకు కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కారణం!
'ఇండియా' బృందం నుంచి అఖిలేష్​ యాదవ్​ ఔట్​?
'ఇండియా' బృందం నుంచి అఖిలేష్​ యాదవ్​ ఔట్​? (HT_PRINT)

'ఇండియా' బృందం నుంచి అఖిలేష్​ యాదవ్​ ఔట్​?

Akhilesh Yadav India alliance : 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి! దేశంలోని కీలక విపక్షమైన సమాజ్​వాదీ పార్టీ.. ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకు కాంగ్రెస్​ పార్టీ ముఖ్య కారణం గమనార్హం. అసలేం జరిగిందంటే..

కాంగ్రెస్​పై సీరియస్​..

2024 లోక్​సభ ఎన్నికల కోసం దాదాపు అన్ని విపక్ష పార్టీలు ఒక్కటై.. 'ఇండియా'గా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే.. కూటమిని ఏర్పాటు చేసినంత ఈజీగా.. విజయం దక్కదని రాజకీయ నిపుణులు చెబుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా సీట్ల షేరింగ్​ విషయంలో తలనొప్పులు తప్పవని అభిప్రాయపడుతున్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందే.. ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, కాంగ్రెస్​ మధ్య విభేదాలు మొదలయ్యాయి!

Akhilesh Yadav latest news : త్వరలోనే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో మధ్యప్రదేశ్​ కూడా ఉంది. సమాజ్​వాదీ పార్టీకి ఉత్తర్​ ప్రదేశ్​తో పాటు మధ్యప్రదేశ్​లోను కాస్త పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో.. తాము బలంగా ఉన్న స్థానాల్లో బరిలో దిగుతామని, కాంగ్రెస్​ అవకాశం ఇవ్వాలని అఖిలేశ్​ యాదవ్​ చెప్పారు. ఆ మాటలను కాంగ్రెస్​ పట్టించుకోలేదు! ఫలితంగా.. ఇప్పుడు.. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరిపై ఒకరు అభ్యర్థులను దింపుకున్న పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయంపై గురువారం మీడియాతో మాట్లాడారు ఎస్​పీ అధినేత. కాంగ్రెస్​పై తన అసహనాన్ని బయటపెట్టారు.

"మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ చీఫ్​ కమల్​నాథ్​తో మాట్లాడాను. మధ్యప్రదేశ్​లో మా పార్టీ ప్రదర్శన గురించి వివరించాను. గతంలో మా ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారు? ఎక్కడ నెంబర్​.2గా నిలిచారో చెప్పాను. మాకు 6 సీట్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్​ చెప్పింది. ఇక అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఎస్​పీ ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో కూటమి లేదని నాకు ముందే తెలిస్తే.. అసలు కలిసేవాడినే కాదు కదా! కాంగ్రెస్​తో మాట్లాడే వాడినే కాదు కదా!" అని అఖిలేశ్​ యాదవ్​ అన్నారు.

Madhya Pradesh Assembly elections 2023 : ఎస్​పీ అధినేత మాటలకు ఉత్తర్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ చీఫ్​ అజయ్​ రాయ్​ కౌంటర్​లు వేయడంతో పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి.

"మధ్యప్రదేశ్​లో ఎస్​పీకి అసలు ప్రభావమే లేదు. అక్కడ ఆ పార్టీ పోటీచేయకూడదు. ఇక ఉత్తర్​ప్రదేశ్​లో కూడా కాంగ్రెస్​ పార్టీ అన్ని లోక్​సభ సీట్లల్లో (80) పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది," అని అజయ్​ రాయ్​ అన్నారు.

ఈ మాటలను అఖిలేశ్​ యాదవ్​ చాలా సీరియస్​గా తీసుకున్నారు. కాంగ్రెస్​పై మాటల దాడి చేశారు.

Congress vs Samajwadi Party : "కాంగ్రెస్​లోని చిన్నచిన్న నేతలు ఎస్​పీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ కాంగ్రెస్​ పార్టీలోని వారు.. బీజేపీతో ఉన్నారు. రాష్ట్రస్థాయిలో పొత్తులు లేవని తెలిస్తే.. మా నేతలను మధ్యప్రదేశ్​కు పంపే వాడినే కాదు. కాంగ్రెస్​.. ఇతర పార్టీలను దారుణంగా చూస్తోంది. ఇండియ కూటమిలో ఉండేందుకు పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది," అని అఖిలేశ్​ యాదవ్​ అన్నారు.

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల విషయంలో.. కాంగ్రెస్​- ఎస్​పీ ఇలా ఒకరిపై ఒకరు అభ్యర్థులను దింపుకోవడం.. బీజేపీకే మంచిది! వీరి మధ్య ఓట్లు చీలితే.. బీజేపీకి గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయి.

తదుపరి వ్యాసం