తెలుగు న్యూస్  /  Entertainment  /  Kareena Kapoor Says Her Younger Son Eats Only When They Play Natu Natu Song

Kareena Kapoor: నాటు నాటు పాట పెడితేనే నా కొడుకు తింటాడు.. కరీనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

10 April 2023, 14:53 IST

    • Kareena Kapoor: నాటు నాటు పాట పెడితేనే నా కొడుకు తింటాడు అంటూ కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ అందరినీ ఎంతలా ఆకర్షిస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
తమ ఇద్దరు పిల్లలతో సైఫ్, కరీనా దంపతులు
తమ ఇద్దరు పిల్లలతో సైఫ్, కరీనా దంపతులు

తమ ఇద్దరు పిల్లలతో సైఫ్, కరీనా దంపతులు

Kareena Kapoor: నాటు నాటు పాట చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఓ ఊపు ఊపేసిన సంగతి తెలుసు కదా. తెలుగు నేలపైనే కాదు.. ఏకంగా ఆస్కార్ వేదికపైనా మార్మోగిపోయింది. ఆ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. ఈ పాటకు ఉన్న క్రేజ్ ఎంతో చెప్పడానికి తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ చేసిన కామెంట్సే నిదర్శనం.

తన కొడుకు నాటు నాటు పాట వింటేనేగానీ ముద్ద తినడని కరీనా అనడం విశేషం. వాట్ వుమెన్ వాంట్ అనే టాక్ షోలో కరీనా కపూర్ ఈ విషయం చెప్పింది. ఈ టాక్ షో నాలుగో సీజన్ ఈ మధ్యే ప్రారంభమైంది. ఈ సందర్భంగా తన చిన్న కొడుకు జహంగీర్ గురించి ఆమె చెబుతూ.. నాటునాటు పాట ఎంతలా మనసుకు హత్తుకునేలా ఉందో చెప్పుకొచ్చింది.

"మేము నాటు నాటు పాట పెడితేనే జే తన డిన్నర్ తింటాడు. అంతేకాకుండా అతనికి హిందీ డబ్ వెర్షన్ కాకుండా ఒరిజినల్ వెర్షనే ఇష్టం. ఆ పాట రెండేళ్ల పిల్లాడి మనసును కూడా తాకింది. ఆ సినిమా, ఆ పాట నుంచి ఓ అద్భుతాన్నే క్రియేట్ చేసినట్లు దీనిని బట్టి అర్థమవుతుంది" అని కరీనా చెప్పడం విశేషం. ఈ మధ్యే ఇండియాకు దక్కిన ఆస్కార్స్ కూడా ఎంతో గర్వకారణమని ఆమె చెప్పింది.

నాటు నాటు పాటకు ఆస్కార్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ తోపాటు ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ దక్కింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.