Sagar - Srisailam Project : శ్రీశైలంలో 852 అడుగులు దాటిన నీటిమట్టం - నాగార్జున సాగర్లో తాజా పరిస్థితి ఇదే..!
Published Jul 25, 2024 05:30 PM IST
- Krishna River Updates: కృష్ణా బేసిన్ లో వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల నుంచి వరదతో శ్రీశైలంతో నీటిమట్టం పెరుగుతోంది. మరోవైపు నాగార్జున సాగర్ లోనూ నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.
శ్రీశైలం, నాగార్జునసాగర్ పెరిగిన నీటిమట్టం
Nagarjuna Sagar and Srisailam Project Updates : మహారాష్ట్ర, కర్ణాటకలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికి తోడూ తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి.
ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. దీంతో జురాల, శ్రీశైలం ప్రాజెక్ట్ లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. గురువారం(జులై 25) ఉదయం రిపోర్ట్ ప్రకారం… శ్రీశైలం జలాశయం నీటిమట్టం 852.5కు చేరింది. నీటినిల్వ 85.75 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి 1,60,798 క్యూసెక్కుల వరద వస్తుండగా…ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్ నిండడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1632.20 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 81,030 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 75,774 క్యూ సెక్కులుగా ఉంది.
సాగర్ లో ఇలా….
ఇక నాగార్జున సాగర్ లో చూస్తే గురువారం ఉదయం రిపోర్ట్ ప్రకారం 10:21 గంటలకు చూస్తే…. 503.8 గా నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 121.38 టీఎంసీల నీటి నిల్వ ఉండగా... ఇన్ ఫ్లో 13,001గా ఉంది. 9,256 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 102.33 అడుగుల నీటిమట్టం ఉంది. 0.98 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 401 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది.