TRS Strategy On Munugode : మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ 50 డేస్ యాక్షన్ ప్లాన్-trs 50 days strategy in munugode by election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs Strategy On Munugode : మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ 50 డేస్ యాక్షన్ ప్లాన్

TRS Strategy On Munugode : మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ 50 డేస్ యాక్షన్ ప్లాన్

HT Telugu Desk HT Telugu

KCR Master Plan On On Munugode By Poll : మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు 50 డేస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది టీఆర్ఎస్ పార్టీ.

సీఎం కేసీఆర్ (Stock Photo)

మునుగోడు ఉపఎన్నికపై అన్ని పార్టీలు దృష్టిపెడుతున్నాయి. ఎలాగైనా గెలవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా అనుకుంటోంది. వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్ గా అనుకుంటున్న ఈ ఎన్నికను కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భారత ఎన్నికల సంఘం ఉపఎన్నిక నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉన్నందున '50 రోజుల కార్యాచరణ' ప్రణాళికను సిద్ధం చేసింది టీఆర్ఎస్. సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్, అక్టోబర్ నెలాఖరులోగా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

తెలంగాణ భవన్‌లో ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ (టీఆర్‌ఎస్‌ఎల్‌పీ) సమావేశానికి ముందు నల్గొండ జిల్లా పార్టీ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యారు. అక్కడి నేతలు.. కార్యాచరణ ప్రణాళికను అందించారు. గణేష్ నిమజ్జనం ఉన్న నేపథ్యంలో ఈ కార్యాచరణ ప్రణాళికను వేగంగా అమలు చేసేందుకు వీలుగా 88 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగత ఇన్ ఛార్జీలుగా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాను వీలైనంత త్వరగా మంత్రి జగదీశ్ రెడ్డికి అందజేస్తానని నల్గొండ పార్టీ నేతలకు సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.

తొలిసారిగా మునుగోడు అసెంబ్లీ స్థానంలోని అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో 1500 మంది నాయకులు, కార్యకర్తలతో 50 రోజులపాటు పార్టీ క్యాంపు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమాయత్తం చేయనున్నారు. సీఎం నివేదికను పరిశీలించి త్వరితగతిన ఆమోదం తెలిపారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం ఈ వ్యూహానికి ఆమోదం తెలిపారు. ఉపఎన్నికలో కచ్చితంగా కట్టుబడి ఉండాలని పార్టీ నేతలకు, క్యాడర్‌కు సూచనలు వెళ్లాయి.

వ్యూహం ప్రకారం ఒక్కో ఎమ్మెల్యేకు రెండు గ్రామాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. మునుగోడు నియోజకవర్గంలో 176 గ్రామాలున్నాయి. అంటే 88 మంది ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జీలుగా నియమించాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో 88 మంది ఎమ్మెల్యేలు మునుగోడులో 50 రోజుల పాటు క్యాంపు వేయనున్నారు.

ఒక్కో ఎమ్మెల్యే 15 మంది కీలక పార్టీ సభ్యులు లేదా నాయకులను మునుగోడుకు తీసుకురావాలని అధిష్ఠానం అనుకుంటోంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనిచేసి ఓటర్లను కలవనున్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మమేకమై ఆసరా పింఛన్లు, దళిత బంధు, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర చెక్కులను అందజేయాలి.

ప్రస్తుతం, మెజారిటీ లబ్ధిదారులు సంబంధిత అధికారుల నుండి చెక్కులను స్వీకరిస్తున్నారు. అయితే పార్టీ నాయకత్వం ఇప్పుడు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ప్రయోజనాలను వ్యక్తిగతంగా అందజేస్తారు. ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు.. టీఆర్ఎస్ ప్రణాళికలు వేస్తోంది.

సంబంధిత కథనం