Sangareddy Road Accident : మధ్య రాత్రి చాయ్ తాగడానికి వెళ్లి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మిత్రుల మృతి!-sangareddy news in telugu fatal accident lorry dashed car three friends died ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Road Accident : మధ్య రాత్రి చాయ్ తాగడానికి వెళ్లి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మిత్రుల మృతి!

Sangareddy Road Accident : మధ్య రాత్రి చాయ్ తాగడానికి వెళ్లి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మిత్రుల మృతి!

HT Telugu Desk HT Telugu

Sangareddy Road Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున దాబాలో చాయ్ తాగడానికి కారులో ఆరుగురు యువకులు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న కారును లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతిచెందారు.

చాయ్ తాగడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మిత్రుల మృతి

Sangareddy Road Accident : సంగారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Sangareddy Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మాసాన్ పల్లి శివారులో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కారులో జోగిపేట నుంచి ఆరుగురు యువకులు కలిసి, జాతీయ రహదారి-161 పక్కనే దాబాలో చాయ్ తాగడానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో మాసాన్ పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ వారి కారుని ఢీకొట్టింది.

జోగిపేట పట్టణానికి చెందినవారే

ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా జోగిపేటకు చెందిన వారుగా గుర్తించారు. మృతులు మొహమ్మద్ వాజిద్, మొహమ్మద్ హాజీ , మొహమ్మద్ ముఖ్రంగా గుర్తించారు. గాయపడిన, మిగతా ఇద్దరి యువకులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని జోగిపేట పోలీసులు తెలిపారు. రాత్రి పూట అనవసరంగా రోడ్డు పైకి రావద్దని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.

తల్లి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొడుకు మృతి

మెదక్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కన్న తల్లి మరణాన్ని తట్టుకోలేక కొన్నిగంటల వ్యవధిలోనే గుండె పోటుతో కొడుకు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి లో జరిగింది. కౌడిపల్లి గ్రామానికి చెందిన దొంత లలిత పది రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్న కూతురు ఇంటికి వెళ్లింది. కాగా ఆదివారం ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుమార్తె ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. అంత్యక్రియలు సొంత గ్రామమైన కౌడిపల్లిలో ఆదివారం సాయంత్రం జరిగాయి. తల్లి మరణంతో కలత చెందిన కుమారుడు దొంత నరేందర్ (45) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

తల్లి,కొడుకు ఒకే రోజు మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. మృతుడు నరేందర్ కు భార్య లక్ష్మి, ఒక కుమారుడు, కూతురు ఉంది. అతడు మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నరేందర్ కు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లె ఉంది. కాగా ఒక అన్న గతంలో ఆత్మహత్య చేసుకోగా, మరొక అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వీరి మృతితో కౌడిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత కథనం