Telangana Sentiment : మరోసారి తెరపైకి సెంటిమెంట్ అస్త్రం..! ఈసారి BRS టార్గెట్ వీళ్లేనా..?-brs is once again bringing telangana sentiment in the background of assembly elections 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Sentiment : మరోసారి తెరపైకి సెంటిమెంట్ అస్త్రం..! ఈసారి Brs టార్గెట్ వీళ్లేనా..?

Telangana Sentiment : మరోసారి తెరపైకి సెంటిమెంట్ అస్త్రం..! ఈసారి BRS టార్గెట్ వీళ్లేనా..?

Mahendra Maheshwaram HT Telugu
Sep 13, 2023 01:17 PM IST

Telangana Assembly Elections 2023: ఎన్నికల యుద్ధంలోకి దిగిన బీఆర్ఎస్…వ్యూహలను సిద్ధం చేస్తోంది. TRSను బీఆర్ఎస్ గా మార్చినప్పటికీ… సెంటిమెంట్ అస్త్రాన్ని విడిచిపెట్టేలా మాత్రం కనిపించటం లేదు. మరోసారి ఈ అస్త్రంతో ప్రధాన ప్రత్యర్థులను ఇరుకునపెట్టేలా పావులు కదుపుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Telangana Assembly Elections 2023:  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరంలోకి దిగింది. నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. ప్రతిరోజూ గ్రౌండ్ లోని పరిస్థితులను అంచనా వేసి… నేతలకు ఫీడ్ బ్యాక్ ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను కూడా లైన్ లోకి తీసుకువచ్చే పనిలో పడింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్…ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే కార్యాచరణను సిద్ధం చేయటంతో పాటు… ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను చేర్చుకుంటూ వేగం పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో… అధికార బీఆర్ఎస్ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా సంధించేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. 

టార్గెట్ కాంగ్రెస్ - మరోసారి అదే అస్త్రం!

మలిదశ ఉద్యమం తర్వాత టీఆర్ఎస్… అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్న పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. సెంటిమెంట్ నినాదంతో సక్సెస్ అయిన పార్టీల్లో టీఆర్ఎస్ ఒకటి అని చెప్పొచ్చు. తెలంగాణ సాధనలో అగ్రభాగన ఉన్న టీఆర్ఎస్… రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత… అనూహ్యంగా రూట్ ను మార్చేసింది. ఏకంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు అధినేత కేసీఆర్. తెలంగాణ పేరుతోనే రాజకీయం చేసే ప్రాంతీయ పార్టీ… తెలంగాణ అనే పదమే లేకుండా పార్టీ పేరును మార్చటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పటికీ… తెలంగాణపై తమకే పేటెంట్ ఉందన్నట్లు అడుగులు వేస్తోంది బీఆర్ఎస్.  సమయం, సందర్భాన్ని బట్టి… నాటి ఉద్యమ ఘట్టాలను గుర్తు చేస్తూ… ప్రత్యర్థులను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ సెంటిమెంట్ తో పెద్దగా పని ఉండదని అంతా భావించినప్పటికీ… 2014, 2018 ఎన్నికల్లో సెంటిమెంట్ అస్త్రాన్ని ఫర్ ఫెక్ట్ గా వాడేసేంది గులాబీ పార్టీ. ముఖ్యంగా 2018 ఎన్నికల వేళ… టీడీపీ - కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటం కేసీఆర్ కు అత్యంత కలిసివచ్చిన అంశమని చెప్పొచ్చు. మహాకూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ… తెలంగాణకు వస్తున్నారని, ప్రజలంతా గమనించాలంటూ ఓటర్లను ఆలోచనలో పడేశారు గులాబీ దళపతి. ఇలా ప్రతి సభలోనూ…. వీరి పొత్తును ప్రస్తావిస్తూ తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు కేసీఆర్.  దీంతో… కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూడగా, గులాబీ పార్టీ 88 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా మారిపోయింది.

ఇదిలా ఉంటే మరోకొద్దిరోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో చంద్రబాబుతో పొత్తు అంశం బెడిసికొట్టడంతో బోల్తా పడిపోయింది కాంగ్రెస్. ఈసారి మాత్రం పక్కాగా ప్లాన్ గా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కట్ చేస్తే…తెలంగాణలో పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల… కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తారనే చర్చ గట్టిగా జరుగుతోంది. ఇదే విషయాన్ని షర్మిల కూడా ధ్రువీకరించారు. ఇటీవలే ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె… తెలంగాణలో కేసీఆర్ ను పడగొట్టడమే తమ లక్ష్యమని ప్రకటించారు. రేపోమాపో ఆమె పార్టీ… కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం కనిపిస్తోంది. విలీనం జరగటంతో పాటు షర్మిల గతంలో ప్రకటించిన మాదిరిగా పాలేరులో పోటీ చేస్తే… కాంగ్రెస్ గుర్తుపైనే బరిలో ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా  రాజ్యసభకు పంపినా… అదే గుర్తుపై వెళ్తోంది. దాదాపు ఆమె తెలంగాణ వేదికగానే రాజకీయాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది.  ఇక ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు.  తాను నాలుగు దశాబ్ధాల నుంచి తెలంగాణలోనే రాజకీయాలు చేస్తున్నానని.. ఏపీ పాలిటిక్స్ లో చొరవ చూపలేదని అన్నారు. తన భార్య, పిల్లలు అందరూ తెలంగాణలోనే ఉంటున్నారని అన్నారు. తాను ఇక్కడి మట్టిలోనే కలిసిపోతానని వ్యాఖ్యానించారు. తనను తెలంగాణ వ్యక్తి లాగా గుర్తించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సరిగ్గా ఈ ఇద్దరు నేతలను టార్గెట్ చేసే పనిలో పడింది బీఆర్ఎస్. వీరిద్దరిని ప్రస్తావిస్తూ…  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టాలని చూస్తోంది.

తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి కేటీఆర్… షర్మిల, కేవీపీల ప్రస్తావనను తెరపైకి తీసుకువచ్చారు. “తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిలలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది. తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి.. వీరు తెలంగాణ కోసం ముసుగులో వచ్చారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి...కేవీపీ రామచందర్రావు... షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు. బహురూపుల వేషాల్లోలో తెలంగాణ పైకి వస్తున్నారు. వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పైకి కనబడేది కిషన్ రెడ్డి.. అదించేది కిరణ్ కుమార్ రెడ్డి, కనబడేది రేవంత్ రెడ్డి ఆడించేది కేవీపీ రామచంద్రరావు. తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ రామచంద్రరావు ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మన కర్మ” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా మరోసారి పరోక్షంగా తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకువచ్చేశారు. 

ఇక మరోమంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా షర్మిలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలపడానికి షర్మిలతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 50-60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్... బీజేపీ పార్టీలు ఎన్నికల వేళ మరోసారి ఓటు వేయమని వస్తున్నారని, ఆ పార్టీల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.  మొన్నటి వరకు ఈ ప్రాంతంలో పర్యటించిన షర్మిల...ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసిందని, రేపు వారంతా కలిసి తెలంగాణను మరోసారి ఆంధ్రాలో కలిపేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. అలాంటి పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని కామెంట్స్ చేశారు. ఇలా వరుసగా కేటీఆర్, మంత్రి గంగుల కామెంట్స్ చేయటంతో…. సెంటిమెంట్ అస్త్రాన్ని మరోసారి బలంగానే వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తున్నట్లు అర్థమవుతోంది.

రాష్ట్రంలో రోజురోజుకూ పరిణామాలు మారిపోతున్నాయి. అందుకు తగ్గట్లే వ్యూహలు ఉండాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఓవైపు 9 ఏళ్లలో జరిగిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే…. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ ను ఇరకటంలో పెట్టేలా మాట్లాడే అవకాశం స్పష్టంగా ఉంది.టీఆర్ఎస్… బీఆర్ఎస్ గా మారిన వేళ… తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం ఈ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా..? గులాబీ బాస్ కేసీఆర్ కూడా మరోసారి… ఇదే అస్త్రాన్ని ప్రయోగించి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తారా..? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

 

IPL_Entry_Point