తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ స్కీమ్ ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అధిక సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. వారి వివరాలను సేకరించింది. కుటుంబ నిర్ధారణ చేసేందుకు మూడు నెలలపాటు సమయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి కావటంతో రుణమాఫీ కాని వారికి స్కీమ్ ను వర్తింపజేయనుంది.
రుణమాఫీ కాని వారిని డబ్బులు జమ చేయటంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. బుధవారం షాద్ నగర్ లో మాట్లాడిన ఆయన…పలు కారణాలతో రుణమాఫీ జరగని 3 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీన మహబూబ్ నగర్ లో జరగనున్న రైతుపండగ సందర్భంగా డబ్బులు జమ చేస్తామని ప్రకటన చేశారు.
రుణమాఫీకి రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని.. మిగతా రైతులకు కూడా అందజేస్తామని తెలిపారు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియకు సమయం తీసుకోవటంతో పలువురు రైతులకు మాఫీ కాలేదని చెప్పారు. వ్యవసాయ శాఖాధికారులు గత 3 నెలలుగా రైతుల వివరాలు సేకరించారని… తప్పులను సరిచేశారని వివరించారు.వీరందరికీ ఈనెల 30వ తేదీన డబ్బులు చేస్తామని స్పష్టం చేశారు.
డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత కథనం