Kejriwal summoned by CBI: లిక్కర్ స్కామ్ (Liquor scam) గా పాపులర్ అయిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise Poilcy) కేసులో దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. తాజాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఈ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor scam) విచారణలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి రావాలని కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను సీబీఐ కోరింది. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర రావు (KCR) కూతురు, రాష్ట్ర ఎమ్మెల్సీ కవితను (K Kavitha) కూడా ఈ కేసుకు సంబంధించి పలుమార్లు విచారించింది. లంచాలు తీసుకుని కొందరు డీలర్లకు అనుకూలంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Excise Poilcy) రూపకల్పనలో ఎలాంటి అవినీతి జరగలేదని ఆప్ వాదిస్తోంది. ఆ పాలసీపై ఆరోపణలు రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆ ఎక్సైజ్ పాలసీని రద్దు చేసింది. ఇప్పుడు, ఈ కేసులో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రినే విచారణ నిమిత్తం హాజరు కావాలని సీబీఐ ఆదేశించడం సంచలనం సృష్టిస్తోంది.
తాజాగా, రూ. 200 కోట్ల మేర బెదిరింపు వసూళ్లకు పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్ర శేఖరన్ (sukesh chandra shekharan)..ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor scam) కు సంబంధించి తనకు, తెలంగాణ నేత కవిత కు మధ్య జరిగినదంటూ ఒక వాట్సాప్ చాట్ ను మీడియాకు విడుదల చేశాడు.