Jr NTR on Keeravani: గోల్డెన్ గ్లోబ్ విజయంపై తారక్ సంతోషం.. భారతీయుడిగా గర్వంగా ఉందని స్పష్టం-ntr congratulates mm keeravani for getting golden globe award ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Congratulates Mm Keeravani For Getting Golden Globe Award

Jr NTR on Keeravani: గోల్డెన్ గ్లోబ్ విజయంపై తారక్ సంతోషం.. భారతీయుడిగా గర్వంగా ఉందని స్పష్టం

Maragani Govardhan HT Telugu
Jan 12, 2023 06:18 PM IST

Jr NTR on Keeravani: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై జూనియర్ ఎన్‌టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా వీడియోను షేర్ చేస్తూ కీరవాణికి అభినందనలు తెలిపారు.

ఎన్‌టీఆర్
ఎన్‌టీఆర్

Jr NTR on Keeravani: అమెరికాలో బుధవారం నిర్వహించిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా సంచలన విజయాన్ని అందుకుంది. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం రావడంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎంఎం కీరవాణి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా ఈ చిత్రంలో నటించిన జూనియర్ ఎన్‌టీఆర్ స్పందించారు. ఈ సినిమాపై ఇంతటి ఆదరాభిమానాలను కురిపించినందుకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

“ఆర్ఆర్ఆర్ చిత్రం మనదేశంలోనే కాకుండా అమెరికా, జపాన్‌లో ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికీ తెలుసు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు విభాగాల్లో నామినేటైంది. అందులో ఓ విభాగంలో కీరవాణి గారు అవార్డు పొందారు. ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప అద్భుతమైన పాటలను అందించిన ఆయన.. నా కెరీర్‌లోనూ సూపర్ పాటలను ఇచ్చారు. కీరవాణి సంగీతంతో ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇందుకు తోటి భారతీయుడిగా గర్వకారణంగా ఉంది. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన అభిమానులు, విలేకరులు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యావాదాలు.” అని తారక్ చెప్పారు.

ప్రస్తుతం ఎన్‌టీఆర్ అమెరికాలో లాంగ్ వెకేషన్‌లో ఉన్నారు. ఈ సెలవుల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పాల్గొంటారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌లో పాల్గొంటారు.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

IPL_Entry_Point