Nindu Noorella Saavasam March 27th Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్లో (NNS 27th March Episode) ఇంట్లో అందరినీ భోజనానికి పిలుస్తుంది మనోహరి. తెల్లవారితే క్యాంప్కి వెళ్లాలనే ఆలోచనతో బాధగా కిందకి దిగుతారు పిల్లలు. వారిని చూసి సంతోషంతో పొంగిపోయినట్లు నటిస్తూ అన్నీ సర్దుకున్నారా అని అడుగుతుంది. అమర్ తల్లిదండ్రులు కూడా వచ్చి భోజనానికి కూర్చుంటారు.
ఆ ఇంటికి అన్నీ తానే అన్నట్లు ప్రవర్తిస్తున్న మనోహరిని చూసి కోపంతో రగిలిపోతారు పిల్లలు. అప్పుడే అమర్ కిందకి వస్తాడు. భోజనానికి కూర్చోమన్న మనోహరితో మిస్సమ్మ ఎక్కడ అని అడుగుతాడు. ఏమో అమర్ తెలీదు ఎక్కడికి వెళ్లిందో ఏమో, అయినా పని వాళ్లని పనివాళ్లలానే చూడాలి అనడంతో అందరూ కోపంగా చూస్తారు. తనకి ఇచ్చిన నగని మనోహరి వెనక్కి తీసుకుందని బాధపడినట్లుంది అమర్ అంటుంది నిర్మల.
అయినా మిస్సమ్మ బంగారం కోసం బాధపడే మనిషి కాదే అంటాడు అమర్. మనసు బాలేదని బయటకు వెళ్లినట్లుంది అమర్. ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది అంటాడు శివరామ్. సరే.. మీరు తినండి, నేను వెళ్లి తీసుకుని వస్తాను అంటాడు అమర్. బయటకు వచ్చి బండి తీసిన అమర్ని చూసి తానూ వస్తానని పిలుస్తుంది అరుంధతి. ఆ మాటికి అమర్ బండి ఆపుతాడు. తన మాట వినపడిందని మురిసిపోతూ వచ్చి బండి ఎక్కుతుంది అరుంధతి. ఇద్దరూ కలిసి మిస్సమ్మ కూర్చున్న చోటుకి వెళ్తారు.
అమర్ బండి మీద వచ్చిన అరుంధతిని చూసి షాకవుతుంది మిస్సమ్మ. వీళ్లిద్దరూ కలిసి వస్తున్నారేంటి అని వెళ్లి అమర్ని అడుగుతుంది. అరుంధతి పక్కకి వెళ్లి దాక్కుంటుంది. తన బండి మీద ఎవరూ రాలేదని అంటాడు అమర్. పక్కింటావిడ వచ్చింది కదా అంటున్న మిస్సమ్మతో వచ్చే దారిలో ఏమైనా తలకి దెబ్బ తగిలిందా అంటాడు అమర్. లేదంటూ అరుంధతి కోసం వెతుకుతుంది మిస్సమ్మ. బాధపడుతూ కూర్చున్న అమర్ని చూసి ఆలోచిస్తుంది.
అప్పుడే అరుంధతి కనపడటంతో మనోహరి గురించి అమర్ పెళ్లి గురించి మాట్లాడుతుంది మిస్సమ్మ. తనకే అమర్లాంటి భర్త వస్తే ఎగిరి గంతేస్తానంటుంది భాగమతి. అది విని అందరి కళ్లు నా భర్త మీదే అనుకుంటుంది అరుంధతి. ఇంటికి బయల్దేరుతుంటే తనకి బుల్లెట్ నేర్చుకోవాలనుంది అని అడుగుతుంది మిస్సమ్మ. సరేనని నేర్పిస్తాడు అమర్. ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. నీలకి అరుంధతి నగల్ని ఇచ్చి వాటికి నకిలీ నగలు చేయించే ప్లాన్ వేస్తుంది.
హాల్లో ఎవరూ లేకపోవడం చూసి నగల సంచీని నీలకి ఇచ్చి పంపుతుంది. అప్పుడే నీలకి రాథోడ్ ఎదురుగా రావడంతో తగిలి సంచీని వదిలేస్తుంది. సంచీని తీసి నీల చేతిలో పెట్టి కళ్లు నేలపై పెట్టమని కోప్పడతాడు రాథోడ్. నీల కంగారుగా వెళ్లడం చూసి ఆగమంటాడు రాథోడ్. నీల చేతిలో ఉన్న అరుంధతి నగలు బయటపడతాయా? మనోహరి కుట్ర అందరికీ తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే మార్చి 28న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!