Mega Family Movie: మెగా ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. చిరు, పవన్, చరణ్‌లతో మల్టీ స్టారర్ మూవీ!-mega family chiranjeevi pawan kalyan ram charan multi starrer harish shankar biggest pan india movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mega Family Movie: మెగా ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. చిరు, పవన్, చరణ్‌లతో మల్టీ స్టారర్ మూవీ!

Mega Family Movie: మెగా ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. చిరు, పవన్, చరణ్‌లతో మల్టీ స్టారర్ మూవీ!

Hari Prasad S HT Telugu

Mega Family Movie: మెగా ఫ్యాన్స్ కు ఇది నిజంగా పండగలాంటి వార్తే అని చెప్పాలి. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లతో ఓ మెగా పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పడం విశేషం.

మెగా ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. చిరు, పవన్, చరణ్‌లతో మల్టీ స్టారర్ మూవీ!

Mega Family Movie: అసలుసిసలు పాన్ ఇండియా మూవీ అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లతో ఓ మల్టీ స్టారర్ కోసం తాను కథ రాసుకున్నట్లు అతడు చెప్పడం విశేషం. పాన్ ఇండియా మూవీ తీయాలని తీయడం కాదు.. అది అలా జరిగిపోవాలని హరీష్ శంకర్ అన్నాడు.

మెగా పాన్ ఇండియా మూవీ

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రమోషన్ల జోరు పెరిగింది. ఇందులో భాగంగా డైరెక్టర్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగానే అతడు ముగ్గురు మెగా హీరోలతో ఓ పాన్ ఇండియా మల్టీ స్టారర్ తీయాలని భావిస్తున్నట్లు చెప్పడం మెగాభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నింపింది.

తాను కూడా ఏదైనా పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడా అని అడిగినప్పుడు.. ఏదో పాన్ ఇండియా స్థాయి తీయాలని తాను తీయనని అన్నాడు. "పాన్ ఇండియా సినిమాలు సహజంగా జరిగిపోవాలి. ఏదో పాన్ ఇండియా మూవీ తీయాలి అని నేను తీయను. ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో లవ్ స్టోరీని నేను రాశాను. అది సినిమాగా చేస్తే దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతేకాదు నేను పవన్ కల్యాణ్, చరణ్, చిరంజీవిల కోసం ఓ సబ్జెక్ట్ పై పని చేస్తున్నాను" అని హరీష్ శంకర్ చెప్పాడు.

ఇదీ అసలుసిసలు పాన్ ఇండియా మూవీ

ఈ సినిమా గురించి చెబుతూ పాన్ ఇండియా మూవీల్లో అతిపెద్దది అవుతుందని అతడు అనడం విశేషం. "ఒకవేళ ఆ సినిమా తీస్తే.. అది అన్ని సినిమాలను మించిపోయి అతిపెద్ద పాన్ ఇండియా సినిమా అవుతుంది. అలాంటి సినిమాలను ప్లాన్ చేయలేము. అవి సహజంగా జరిగిపోవాలి.

పుష్ప, కాంతారా కూడా మొదట్లో పాన్ ఇండియన్ సినిమాలుగా ప్లాన్ చేయలేదు. కాంతారా ద్వారా తమ ప్రాంత స్టోరీని మేకర్స్ చెప్పారు. అది ఇండియా మొత్తం ఆమోదించింది. మన సంస్కృతికి అద్దం పట్టిన నాటు నాటు పాట ఆస్కార్ గెలిచింది. నా సినిమాలు తీయడానికి ముందు వాటి గురించి వివరాలు చెప్పడం నాకు నచ్చదు" అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

అతని డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆదివారమే (జులై 28) ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ కూడా రిలీజ్ కానుండటంతో ఈ రెండు సినిమాల మధ్య ఏది పైచేయి సాధిస్తుందన్న ఆసక్తి నెలకొంది. టైగర్ నాగేశ్వర రావు, ఈగల్ డిజాస్టర్ల తర్వాత రవితేజ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

బ్లాక్ మనీపై ఫైట్ చేసే పవర్ ఫుల్ పాత్రలో ఈ మూవీలో రవితేజ కనిపిస్తున్నాడు. టీజర్ లో తనదైన స్టైల్ మాస్ ఎలిమెంట్స్ తోపాటు ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా మూవీలో ఉండనున్నట్లు తేలిపోయింది.