YS Viveka Death: కడపలో వైఎస్.వివేకా ఐదో వర్థంతి, న్యాయం గెలిచే వరకు సునీత కోసం పోరాడతానన్న షర్మిల…-ys vivekas fifth death anniversary in kadapa sharmila says she will fight for sunita till justice prevails ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Viveka Death: కడపలో వైఎస్.వివేకా ఐదో వర్థంతి, న్యాయం గెలిచే వరకు సునీత కోసం పోరాడతానన్న షర్మిల…

YS Viveka Death: కడపలో వైఎస్.వివేకా ఐదో వర్థంతి, న్యాయం గెలిచే వరకు సునీత కోసం పోరాడతానన్న షర్మిల…

Sarath chandra.B HT Telugu
Mar 15, 2024 01:28 PM IST

YS Viveka Death: తాము అన్నా అని పిలిచే వ్యక్తి సొంత చిన్నాన్న చంపిన వాళ్లను కాపాడుతున్నారని, ఐదేళ్లుగా వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్నామని, దోషులకు శిక్ష పడే వరకు సునీతకు అండగా ఉంటానని షర్మిల ప్రకటించారు.

వైఎస్ వివేకా హత్యకు ఐదేళ్లు పూర్తి
వైఎస్ వివేకా హత్యకు ఐదేళ్లు పూర్తి

YS Viveka Death: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 5 వ వర్ధంతి సందర్భంగా కడపలో జరిగిన కార్యక్రమంలో పిసిసిPCC  అధ్యక్షురాలు షర్మిల  Sharmila తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణ గా ఉన్నాడని 'ముఖ‌్యమంత్రి YS Jaganను ఉద్దేశించి ఆరోపించారు.  చెల్లెళ్ళ మీద ఎన్ని అభాండాలు వేసినా తట్టుకున్నామని, వివేకా కేసులో సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి,ధర్మ పోరాటానికి నేను అండగా ఉంటానని చెప్పారు. ఆస్తికోసం, అంతస్తు కోసం జరిగే పోరాటం కాదని న్యాయం కోసం జరుగుతున్న పోరాటమన్నారు.

ప్రజలంతా ఒక నిర్ణయం తీసుకోవాలని, హత్యా రాజకీయాలను చీ కొట్టాలని, వివేకా హంతకుల పక్షాన నిలబడ్డ వారికి గుణపాఠం నేర్పాలని, నిజం గెలవాలని వైఎస్ షర్మిలా పిలుపునిచ్చారు.

కడపలో వైఎస్ వివేకా నందరెడ్డి 5వ జ్ఞాపకార్థ సభలో ఏపీసీసీ APCC అధ్యక్షురాలు షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. హత్యకు గురవడానికి ముందు ఆఖరిసారి తన ఇంటికొచ్చి కడప ఎంపీగా పోటీచేయాలని అడిగారని గుర్తు చేసుకున్నారు.

సాయం చేయడంలో వివేకా ఎప్పుడూ ముందుండేవారని, దాదాపు రెండు గంటలపాటు తనను ఒప్పించే ప్రయత్నం చేశారని, ఎన్నిసార్లు వద్దులే చిన్నాన్న అని చెప్పినా.. ఓపికగా నాతో మాట్లాడారన్నారు.

వివేకా చివరి సారి కలిసినపుడు కడప ఎంపీ స్థానానికి పోటీచేయమని గట్టిగా కోరారని, అన్నీ అనుకూలిస్తే చేస్తాలే అని చెప్పేవరకు చిన్నాన్న వెళ్లలేదన్నారు. తన చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచాయని, చిన్నాన్న చావు నమ్మలేని నిజమని, దుర్మార్గ పాలన చక్రాల కింద నలిగిపోతూ న్యాయం కోసం పోరాటం చేస్తున్న నిప్పులాంటి నిజం అన్నారు.

మంచి మనిషిని చంపేశారు…

సమాజంలో మంచి మనిషిని దుర్మార్గంగా చంపేశారని, ఐదేళ్లు గడిచినా న్యాయం జరగలేదంటే ఏమనాలని ప్రశ్నించారు. ఈ రోజు వరకూ హంతకులకూ శిక్ష పడలేదని, తమ సొంత - చిన్నాన్న విషయంలో ఇలా అయితే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు.

చిన్నాన్న గుండెపోటుతో మరణించారని ప్రచారం చేశారని, అన్నా అని పిలిపించుకున్నవారే.. హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. హత్యచేసింది ఎవరో కాదు.. బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని, ఇవాళ్టి వరకు హత్య చేసిన, చేయించిన వాళ్లకు శిక్ష పడలేదన్నారు.

చనిపోయిన రాత్రి చివరిక్షణం వరకు చిన్నాన్న వైసీపీ కోసమే పనిచేశారని, - జగనన్న ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదన్నారు. సాక్షిలో పైన వైఎస్ ఫోటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం ఏమిటన్నారు.

అద్దం ముందు ప్రశ్నించుకోండి…

జగనన్నా.. అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని సూచించారు. అద్దం ముందు నిల్చొని మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినాలని, - వైఎస్ తన తోబుట్టవుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? అన్నారు. వైఎస్ వారసుడిగా తోబుట్టువుల కోసం మీరేం చేశారన్నారు. సునీత, తాను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగామని సునీతకు అండగా ఉంటానని చెప్పారు.

సోషల్ మీడియాలో బెదిరించారు.బూతులు తిట్టారని, తోడబుట్టిన చెల్లెల్లు అని చూడకుండా అవమానాలకు గురి చేశారని, అన్నింటికీ తట్టుకున్నామని, న్యాయం కోసం సునీత తిరగని చోటు లేదు.. తట్టని గడప లేదన్నారు. సునీత కుటుంబం హత్య చేసి ఉంటే .. సునీత ను ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. సునీత కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

హత్య ఎవరు చేశారో మీకు తెలుసని, అందుకే ధైర్యం రావడం లేదన్నారు. సునీతను వైఎస్సార్ ఎలా చూసుకున్నాడో మీకు తెలీదా అని ప్రశ్నించారు. సునీత డాక్టర్ సునీత అని,ఒక డాక్టర్ గా తనకంటూ ఒక స్థానం ఉందని గుర్తు చేశారు. జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు ఉందని, సునీతను చూసిన ప్రతి సారి నా గుండెల్లో అంతులేని బాధ గుర్తుకు వస్తుందన్నారు. సునీత కు..చిన్నమ్మ కి మాట ఇస్తున్నానని, ఎవరు ఉన్నా లేకున్నా...వైఎస్సార్ బిడ్డ మీకు అండగా ఉందని చెప్పారు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం