Viveka Murder Case: వివేకా హత్య కేసులో బెయిల్ పిటిషన్లపై సిబిఐ అభ్యంతరం-cbi objects to bail pleas of accused in vivekas murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Viveka Murder Case: వివేకా హత్య కేసులో బెయిల్ పిటిషన్లపై సిబిఐ అభ్యంతరం

Viveka Murder Case: వివేకా హత్య కేసులో బెయిల్ పిటిషన్లపై సిబిఐ అభ్యంతరం

HT Telugu Desk HT Telugu
Aug 25, 2023 09:02 AM IST

Viveka Murder Case: మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైన వైఎస్‌.భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సిబిఐ అభ్యంతరం తెలిపింది. వివేకా హత్యలో నిందితుల ప్రమేయం ఉందని, బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని పేర్కొంది.

వివేకా కేసులో మరో పరిణామం
వివేకా కేసులో మరో పరిణామం

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ శంకర్‌ రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సిబిఐ అభ్యంతరం తెలిపింది. వివేకా హత్యతో ఇద్దరి ప్రమేయం ఉందని, వారిని బెయిల్‌పై విడుదల చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని వాదించింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై సిబిఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో పాటు, సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో వైఎస్‌ భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కీలక పాత్ర పోషించారని బెయిల్‌ పిటిషన్‌ల విచారణలో సీబీఐ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. నిందితులు సమాజంలో పలుకుబడి ఉన్నవారని, సాక్షులను ప్రభావితం చేయగలరని, వారికి బెయిలు మంజూరు చేయ రాదని విజ్ఞప్తి చేసింది. గతంలో కూడా కేసు దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు బెయిలిస్తే విచారణను సాఫీగా సాగనివ్వరని తెలిపింది.

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వైఎస్‌ భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ గురువారం విచారణ జరిపారు. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌ తోమర్‌ వాదనలు వినిపిస్తూ దస్తగిరి వాంగ్మూలంతోపాటు దానికి తగ్గ పలు ఆధారాలను పరిశీలించిన తర్వాతే కేసులో వీరిని నిందితులుగా పేర్కొన్నట్లు చెప్పారు.

వివేకా హత్యలో పాల్గొన్న దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంపై అభ్యంతరాలు చెప్పేందుకు ఇది సమయం కాదని, విచారణ సమయంలో క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసుకోవచ్చన్నారు. వివేకా హత్యకు రూ.40 కోట్ల ఒప్పందం కుదిరిందని, ఇందులో భాగంగా రూ.కోటి అడ్వాన్సుగా దస్తగిరికి ఇవ్వాల్సి ఉందని సిబిఐ న్యాయవాది తోమర్ చెప్పారు.

మరో నిందితుడు సునీల్‌యాదవ్‌ రూ.25 లక్షలు ఉంచుకుని దస్తగిరికి రూ.75 లక్షలు ఇచ్చారని వాటితో విల్లా కొనాలని దస్తగిరి ప్రయత్నించారన్నారు. ఇందులో రూ.40 లక్షలను దస్తగిరి స్నేహితుడు మున్నాకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుందన్నారు. రూ.40 లక్షలు తన ఖాతాలో ఉంచుకునే స్తోమత మున్నాకు లేదని వివరించారు. దస్తగిరికి కింది కోర్టు ఇచ్చిన క్షమాభిక్షను ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా సమర్థించాయన్నారు. హత్యకు ముందు, తరువాత నిందితులైన సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలు వైఎస్‌ భాస్కరరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసంలో ఉన్నారని గూగూల్‌ టేకౌట్‌ ద్వారా తేలిందని వివరించారు.

వివేకా అల్లుడి సోదరుడు ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డి ఉదయం 6.26 గంటలకు అవినాష్‌రెడ్డికి ఫోన్‌లో వివేకా హత్య గురించి సమాచారం అందించారని,విషయం తెలిసిన రెండు నిముషాల్లో ఆయన వివేకా ఇంటి వద్ద ఉన్నారన్నారు. హత్య గురించి ముందే తెలిసిన అవినాష్‌రెడ్డి తదితరులు మాత్రం సమాచారం కోసం ఎదురుచూశారన్నారు.

ఎన్నికల ప్రచారం కోసం అవినాష్‌రెడ్డి కడప వెళుతున్నారన్నది అవాస్తవమని రామచంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో తేలిందన్నారు. సంఘటన గురించి ఎవరికీ తెలియక ముందే ఉదయ్‌కుమార్‌రెడ్డి తన తల్లికి వివేకా హత్య గురించి చెప్పారన్నారు. వివేకా హత్య రోజున ఉదయ్‌కుమార్‌రెడ్డి రాత్రంతా పులివెందుల వీధుల్లో తిరుగుతూ గడిపాడని,చివరకు అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారన్నారు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసిన వైఎస్‌ భాస్కరరెడ్డి సంఘటన స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా తలుపులు మూసి సాక్ష్యాధారాలను చెరిపి వేయించారన్నారు. వివేకా మృతదేహాన్ని చూస్తే హత్య అని తెలుస్తున్నా గుండెపోటుతో చనిపోయారని కట్టుకథ చెప్పారన్నారు. బ్యాండేజీ, పూలతో వివేకా దేహంపై గాయాలను కప్పిపెట్టారని సిబిఐ వాదించింది.

నేరారోపణలకు ఆధారాల్లేవన్న నిరంజన్‌ రెడ్డి….

భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దస్తగిరి వాంగ్మూలం తప్ప వారిపై నేరం మోపడానికి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. రెండున్నర నెలలు దిల్లీలో సీబీఐ వద్ద ఉన్న దస్తగిరి ఎలాంటి వివరాలు వెల్లడించ లేదని, ముందస్తు బెయిలు ఇవ్వగానే నేరాన్ని అంగీకరిస్తూ అన్ని వివరాలు వెల్లడించారని కోర్టుకు చెప్పారు.

బెయిలు ఇచ్చిన వెంటనే దస్తగిరి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశారని, దాన్ని కడప కోర్టు ఆమోదించిందన్నారు. మొత్తం రికార్డు పులివెందుల కోర్టులో ఉంటే.. దాన్ని పరిశీలించకుండానే కడప కోర్టు క్షమాభిక్షపై నిర్ణయం తీసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గూగుల్‌ టేకౌట్‌ ఆధారాలు చట్టపరంగా చెల్లవని. సీబీఐ అధికారి రాంసింగ్‌పై పలు ఆరోపణలున్నాయని, ఆయన కొట్టడంతో పలు కేసులు కూడా నమోదయ్యాయన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు నుంచి రాంసింగ్‌ను తప్పించారని గుర్తు చేశారు. హత్యకు రాజకీయ విభేదాలంటున్నారని, అవినాష్‌ రెడ్డి ఎంపీగా ఉన్నారని, వివేకా ప్రచారం చేశారని అలాంటప్పుడు రాజకీయ శత్రుత్వం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. నిందితులు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని, భాస్కరరెడ్డి అనారోగ్యంతో సతమతమవుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.మరోవైపు వివేకాహత్య కేసులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసిన శివశంకర్‌ రెడ్డి పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. శివశంకర్‌ రెడ్డి బెయిల్‌కు సిబిఐ అభ్యంతరం తెలిపింది. రాజకీయంగా ఎదగనివ్వకపోవడంతోనే హత్యకు కుట్రపన్నారని సిబిఐ ఆరోపించింది. బెయిల్‌ పిటిషన్ కొట్టేయాలని కోరడంతో ఈ నెల 29కు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోడానికి వాయిదా వేశారు.

IPL_Entry_Point