TTD Board Decisions : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి తొలి సమావేశం ఇవాళ తిరుమలలో జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బోర్డు ఈ నిర్ణం తీసుకుంది. తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. శారదా పీఠం లీజు రద్దు చేసింది. టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టడంతో పాటు దేవస్థానంలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టకూడదని నిర్ణయించింది.
రెండు, మూడు గంటల్లోనే సర్వదర్శనం భక్తులకు దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ పనిచేస్తోన్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ కు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లోనే తొలగిస్తామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా నిషేధం విధించాలని నిర్ణయించామన్నారు. టీటీడీ చెందిన నగదును ప్రైవేటు బ్యాంకుల్లో నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామన్నారు. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నామన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని బీఆర్ నాయుడు చెప్పారు.
అలిపిరిలో దేవలోక్ సంస్థకు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అన్నప్రసాదంలో మరో ఐటమ్ను భక్తులకు వడ్డించాలని నిర్ణయించామన్నారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశామన్నారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో శారదా పీఠానికి తిరుమలలో కేటాయించిన భూములు రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ స్థలంలో శారదా పీఠం నిర్మించిన భవనాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. పర్యటక శాఖకు కేటాయిస్తున్న 4 వేల దర్శనం టిక్కెట్లు రద్దు చేస్తునట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
సంబంధిత కథనం