AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ... తీసుకున్న కీలక నిర్ణయాలివే-several key decisions approved in andhra pradesh cabinet meeting check inside full details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ... తీసుకున్న కీలక నిర్ణయాలివే

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ... తీసుకున్న కీలక నిర్ణయాలివే

HT Telugu Desk HT Telugu
Feb 08, 2023 04:10 PM IST

Ap Cabinet News: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం… పలు నిర్ణయాలు తీసుకుంది.

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ (twitter)

Ap Cabinet Decisions: ఏపీ మంత్రివర్గ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన అజెండాలోని అన్ని అంశాలకు ఆమోదముద్ర వేసింది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడికి అంగీకారం తెలిపింది

కర్నూల్, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలో విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను ఎనర్జి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. 4 విడతల్లో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఫలితంగా రెండు వేల మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది.

ఆసరా, వైఎస్ఆర్ లా నేస్తం, ఈ బీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణమస్తు పథకాలకు మంత్రివర్గ ఆమోదం లభించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

బందర్ పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.3940 కోట్ల ఋణం తీసుకొనేందుకు అనుమతి పొందింది. 9.75 శాతం వడ్డీతో ఈ రుణం తీసుకోనున్నారు.

పుంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వైజాగ్ టెక్ పార్క్ కు 60 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజిగా మార్చేందుకు మంత్రివర్గం నిర్ణయించింది.

గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు కేబినెట్ అంగీకరించింది.

మరిన్ని నిర్ణయాలు:

ఎన్టీఆర్‌ జిల్లా నందిగాంలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను రూ.34.48 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌ గ్రేడ్‌ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర, జోనల్, జిల్లా స్ధాయిలో పోస్టుల భర్తీ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యుల నియామకం. ఒక 104 వాహనం. ఒక వైద్యుడు పీహెచ్‌లో ఉంటే, మరో వైద్యుడు గ్రామాల్లో ఇళ్లకు వెళ్తారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా వైద్య ఆరోగ్యశాఖలో ప్రతి పీహెచ్‌సీలో సిబ్బందిని 12 నుంచి 14 మందికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. ఇందులో భాగంగా కొత్తగా 1,610 కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం.

వైఎస్సార్‌ జిల్లా ఫాతిమా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 2015–16లో కేటగిరీ ఏ తో పాటు, తర్వాత విద్యాసంత్సరాలకు సంబంధించి కేటగిరీ బీ, సీలకు చెందిన విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు అంశాన్ని స్పెషల్‌ కేసుగా పరిగణించి చెల్లించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం. రూ.9,12,07,782 చెల్లించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టులో జిల్లా సమన్వయకర్తలుగా 10 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లను ఫారిన్‌ సర్వీసు డిప్యూటేషన్‌ (ఎఫ్‌ఎస్‌డి)పై నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

1998 డీఎస్సీలో క్వాలిఫైడ్‌ అభ్యర్ధులతో 4,534 సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పోస్టుల భర్తీ. డిఎస్సీ –1998 క్వాలిఫైడ్‌ అభ్యర్ధులతో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం. వీరికి మినిమమ్‌ టైం స్కేల్‌(ఎంటీఎస్‌) వర్తింపుచేయాలన్న ప్రతిపాదనకూ మంత్రిమండలి ఆమోదం.

మార్చి 2వ తేదీ నుంచి మిడ్‌ డే మీల్స్‌లో రాగిజావ. మధ్యాహ్న భోజన పథకం మెనూలో కొత్తగా అమల్లోకి రానున్న రాగిజావ.

మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం. సబ్జెక్టు టీచర్లగా అర్హత పొందిన 5,809 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు నెలకు రూ.2500 చొప్పున సబ్జెక్ట్‌ టీచర్‌ అలవెన్స్‌ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న గౌరవవేతానానికి అదనంగా 23 శాతం పెంచుతూ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

విశాఖపట్నంలో 100 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్కు, స్కిల్‌ సెంటర్‌తో పాటు రిక్రియేషన్‌ సెంటర్ల ఏర్పాటు కోసం అవసరమైన 60.29 ఎకరాల భూమి వైజాగ్‌ టెక్‌ పార్కు లిమిటెడ్‌ (వీటీపీఎల్‌)కు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలకు సంబంధించి 10 ప్రిన్సిపాల్, 138 బోధనా సిబ్బంది, 36 నాన్‌ టీచింగ్‌ పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

ఏపీ జువైనల్‌ వెల్పేర్‌ డిపార్ట్‌మెంట్, విజయవాడలో డైరెక్టర్‌ పోస్టు భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌లో 29 అదనపు పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పీవీ సింధు బ్యాడ్మెంటెన్‌ అకాడమీ అండ్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌ను రద్దు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాల్టీస్‌ యాక్టు –1965, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ యాక్టు – 1955లకు సవరణలకు సంబంధించిన డ్రాప్ట్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.

సర్వే సెటిల్మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మరియు రెవెన్యూశాఖల సహాయంతో అర్భన్‌ లోకల్‌ బాడీస్‌ (యూఎల్‌బీస్‌)లో సమగ్ర భూముల రీ సర్వే పనుల కోసం అవసరమైన సవరణలకు కేబినెట్‌ ఆమోదం.

ఏపీ మున్సిపల్‌ అకౌంట్స్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ కింద పరిపాలనా సౌలభ్యం కోసం డిప్యూటీ డైరెక్టర్‌ (అకౌంట్స్‌) పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటుకు అవసరమైన భూమిని 20 సంవత్సరాల లీజు పీరియడ్‌కు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం.

ఆంధ్రప్రదేశ్‌ హైడ్రో ప్రాజెక్టు ప్రమోషన్‌ పాలసీ –2022లోని ప్రొవిజన్‌ 3 ప్రకారం ... వివిధ పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టు సంస్ధలకు అవసరమైన అనుమతులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.

ఎకోరన్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ సంస్ధకు సుమారు 1000 మెగావాట్ల విండ్‌పవర్, 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో దశలవారీగా నిర్మాణం కానున్న విండ్, సోలార్‌ ప్రాజెక్టులు.అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురంలో 250, కర్నూలు జిల్లా బేతంచర్లలో 118.8 మెగావాట్స్, అనంతపురం జిల్లా కురుబరాహల్లిలో 251.2 మెగావాట్స్, కర్నూలు జిల్లా చిన్న కొలుములపల్లిలో 251.2 మెగావాట్స్, కర్నూలు జిల్లా మెట్టుపల్లిలో 100 మెగావాట్స్, జలదుర్గంలో 130 మెగావాట్లు విండ్‌ ప్రాజెక్టులు ఏర్పాటు.

ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో వివిధ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

ఏపీ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీలో రెండు పోస్టులు (1 డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్, 1 డేటా ఎంట్రీ ఆపరేటర్‌) తో పాటు 13 జిల్లాల్లో 13 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ మరియు డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీస్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో 14 ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్ల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

విజయనగరంలో అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

లీగల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూట్స్‌ సజావుగా నడిచేందుకు వీలుగా సపోర్టింగ్‌ స్టాప్‌ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.

అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో పోస్టుల భర్తీకి నిర్ణయం.

మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

ఆంధ్రప్రదేశ్‌ వాల్యూ యాడెడ్‌ టాక్స్‌ (వ్యాట్‌) –2023 బిల్లు సవరణలకు మంత్రిమండలి గ్రీన్‌ సిగ్నల్‌.

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం మరింత మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరేలా మార్పులుకు కేబినెట్‌ ఆమోదం.

ఇంతకుముందు క్యూఎస్ ర్యాంకింగ్‌లో టాప్‌ -200 విశ్వవిద్యాలయాల వరకే పరిమితం. ఇకపై దాదాపు 21 సబ్జెక్టులు/ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్టు లేదా ఫ్యాకల్టీలో టాప్‌ 50 కాలేజీలు లేదా విద్యాసంస్ధల్లో సీటు సాధించినవారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తింపు.

ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఏపీఎస్‌పీఎఫ్‌)లో 105 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

మరోవైపు కేబినెట్ భేటీలో ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు నివాళులు అర్పించారు. ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్‌ సాగర్‌కు నివాళి అర్పిస్తూ కేబినెట్ మౌనం పాటించింది.

IPL_Entry_Point