Guarantee Pension in Ap: సిపిఎస్‌ ఉద్యోగులకు మరింత మెరుగైన గ్యారంటీ పెన్షన్ ఆఫర్ చేయనున్న జగన్ సర్కారు-jagan government to offer better guaranteed pension to cps employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Jagan Government To Offer Better Guaranteed Pension To Cps Employees

Guarantee Pension in Ap: సిపిఎస్‌ ఉద్యోగులకు మరింత మెరుగైన గ్యారంటీ పెన్షన్ ఆఫర్ చేయనున్న జగన్ సర్కారు

HT Telugu Desk HT Telugu
Jun 06, 2023 09:29 AM IST

Guarantee Pension in Ap: ఏపీలో గత కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టిన ఉద్యోగుల్ని బుజ్జగించేందుకు సర్కారు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. వేతనాల చెల్లింపుతో పాటు సీపీఎస్ రద్దు, వేతన సవరణలు, డిఏ చెల్లింపు కోసం ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారు. జిపిఎస్‌లో కొత్త ఆప్షన్లను తెరపైకి తెస్తోంది.

సీఎం జగన్
సీఎం జగన్ (Twitter)

Guarantee Pension in Ap: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల్ని దారికి తెచ్చుకోడానికి సర్కారు కొత్త వ్యూహాలు రచిస్తోంది. ప్రభుత్వ తీరుపై కారాలు మిరియాలు నూరుతున్న ఉద్యోగుల్ని బుజ్జగించి తమ దారిలోకి తెచ్చుకోడానికి మెరుగైన పెన్షన్‌ ఆఫర్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఓపీఎస్‌తో దాదాపు సమానంగా పెన్షన్‌ విధానాన్ని అమలు చేసేలా విధివిధానాలు రూపొందించారు. పదవీ విరమణ సమయంలోని మూలవేతనంలో 50% పెన్షన్‌‌గా అందుకునేలా ప్రతిపాదిస్తారని చెబుతున్నారు. ఓపీఎస్‌ పెన్షనర్లకు ఇస్తున్నట్లుగానే కరువు భత్యం కూడా చెల్లించనున్నారు.

పీఆర్సీ ప్రయోజనాలు మినహా మిగతావన్నీ ఓపీఎస్‌ మాదిరిగానే వర్తించనున్నాయి. డీఆర్‌ ఇస్తూ వెళ్తే ద్రవ్యోల్బణం మేరకు పెన్షన్‌ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. తద్వారా ధరల పెరుగుదల భారం నుంచి తప్పించవచ్చని చెబుతుననారు. ఉద్యోగులు ఇప్పుడు చెల్లిస్తున్న 10 శాతం వాటా చెల్లిస్తే చాలని ప్రతిపాదిస్తున్నారు.

భద్రత కల్పించేలా జిపిఎస్‌ ప్రణాళిక…

పదవీ విరమణ పొందిన ఉద్యోగుల జీవితాలకు ఆర్థిక భద్రతతో పాటు భరోసా కల్పించాలన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సీపీఎస్‌ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్‌ విధానం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సీపీఎస్‌ ఫండ్‌ గణాంకాల ప్రకారం చూస్తే ఉద్యోగి ఆఖరి నెల మూల వేతనంలో గరిష్టంగా 20 శాతం మాత్రమే పెన్షన్‌గా వస్తుందని శాస్త్రీయ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

పెన్షన్ స్థిరంగా ఉండి పెన్షనర్‌ జీవితకాలంలో పెరగదు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 33 శాతం పెన్షన్‌ గ్యారంటీ కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి ఉద్యోగులు సుముఖత వ్యక్తం చేయలేదు. ద్రవ్యోల్బణం పెరుగుదల వల్ల జీవన వ్యయం అధికమై పెన్షనర్లు ఇబ్బందులు పడతారని ఉద్యోగ సంఘాలు అభ్యంతరం తెలిపాయి.

ఈ నేపథ్యంలో పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రత, భరోసా కల్పించాలన్నసిఎం జగన్‌ సూచన మేరకు ఓపీఎస్‌ విధానంలో మాదిరిగానే మెరుగైన గ్యారంటీ పెన్షన్‌ విధానంలో ధరల పెరుగుదల నుంచి పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకు ఏటా 3 శాతం పెంచేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెబుతున్నారు. ప్రతిపాదనలపై చర్చ జరిగినప్పుడు ఏటా 3 శాతం పెంపు కేవలం కంటితుడుపులా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

సీపీఎస్‌ ఉద్యోగుల్ని సంతృప్తి పరిచేలా పెంపు…

ఉద్యోగులు ఆశిస్తున్నట్లుగా ఓపీఎస్‌కు దాదాపు సమానంగా పెన్షన్‌ విధానం ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ కీలక సూచన చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీపీఎస్ పెన్షనర్లకు ఏటా పెరుగుదల 3 శాతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెల్లకు ఒకసారి పెంచే డీఏ పాయింట్ల ఆధారంగా రాష్ట్రంలో ఉద్యోగులకు కరువుభత్యం, పెన్షనర్లకు డీఆర్‌ పెంచుతున్న మాదిరే ఈ పెన్షన్‌ విధానంలోనూ పెన్షనర్లకు డీఆర్‌ పెంచడం సమంజసంగా ఉంటుందని సీఎం సూచించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ విధానాన్ని అమలు చేస్తే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత చేకూరడంతో పాటు ధరల పెరుగుదల నుంచి వారికి ఉపశమనం కలుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలిసింది. ఓపీఎస్‌కు దాదాపు సమానమైన పెన్షన్‌ అందుకొనే విధానం ఉండాలని, ప్రభుత్వం తెస్తున్న పెన్షన్‌ విధానం సీపీఎస్‌ ఉద్యోగులను సంతృప్తిపరచాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది..

గ్యారంటీ పెన్షన్‌ను 33 శాతం నుంచి ఓపీఎస్‌ మాదిరిగా 50 శాతానికి పెంచాలని కూడా ముఖ్యమంత్రి భావించారు, అలా చేస్తే సీపీఎస్‌ ఉద్యోగుల ఆకాంక్ష నెరవేరుతుందని, ఓపీఎస్‌కు దాదాపు సమానమైన విధానం రూపకల్పన చేసినట్లవుతుందని సూచించారు.

పీఆర్సీ మినహా అన్ని ప్రయోజనాలు

ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు అధికారులు ప్రతిపాదనలు మళ్లీ సవరించి పాత పెన్షన్‌ విధానంలో మాదిరే ఉద్యోగులకు ఆఖరి నెల మూలవేతనంలో 50 శాతం పెన్షన్‌గా నిర్ధారించడంతో పాటు ఓపీఎస్‌ విధానంలో పెన్షనర్లకు పెంచినట్లే డీఆర్‌ కూడా పెంచేలా మెరుగైన పెన్షన్‌ విధానాన్ని రూపొందించారు.

మంత్రివర్గం ఆమోదం తెలిపితే ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా సీపీఎస్‌ ఉద్యోగులకు ఓపీఎస్‌తో దాదాపు సమానమైన మెరుగైన పెన్షన్‌ విధానం అమల్లోకి వస్తుంది. పీఆర్సీ ప్రయోజనాలు మినహా ఓపీఎస్‌లోని మిగతా ప్రయోజనాలన్నీ ముఖ్యమంత్రి జగన్‌ సూచించిన తాజా పెన్షన్‌ విధానంలో ఉంటాయని ఆర్ధిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ప్రజల సరాసరి జీవితకాలం పెరిగిన నేపథ్యంలో ఏటా కనీసం 5 శాతం డీఆర్‌ పెరుగుతుందనుకున్నా 20 ఏళ్లలో పెన్షన్‌ రెట్టింపవుతుంది. సీపీఎస్‌లో చెల్లిస్తున్న మాదిరే 10 శాతం వాటాగా ఉద్యోగులు చెల్లిస్తే చాలు. ఉద్యోగులు నష్టపోకుండా ఇది మెరుగైన విధానం అవుతుందంటున్నారు.

ఓపీఎస్‌‌తో ఎదురయ్యే సవాళ్లు ఇవి…

సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ తీసుకురావడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని ఆర్ధిక శాఖ చెబుతోంది. ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఇవ్వాల్సిన పెన్షన్లు, ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది.

2040 నాటికి బడ్జెట్‌ నుంచి పెన్షన్ల కోసం చేయాల్సిన వ్యయం రూ.60,706 కోట్లకు చేరుకుంటుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ఏడాదిలో బడ్జెట్‌ నుంచి చేసే ఖర్చు రూ.1,85,172 కోట్లకు చేరుతుంది. రాష్ట్రానికి సొంతంగా వచ్చే రాబడిలో ప్రతి నెల తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం 181 శాతానికి చేరుకుంటుంది. మరో పదేళ్ల తర్వాత అంటే 2050 నాటికి 197 శాతానికి చేరుకుంటుంది.

మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడో ఓసారి వస్తుందని, అప్పుడు మళ్లీ చాలీచాలని పెన్షన్‌ విధానాన్ని తీసుకురావాల్సి వస్తుందని చెబుతున్నారు.

ఓపీఎస్‌ బదులుగా ఇప్పుడున్న సీపీఎస్‌తో భరోసా లేదన్నది వాస్తవమని, ప్రతి దశాబ్దానికీ తగ్గిపోతున్న బ్యాంకుల వడ్డీరేట్లు నేపథ్యంలో ఇప్పుడు అందుతున్న సీపీఎస్‌కూడా భవిష్యత్తులో మరింత తగ్గే పరిస్థితులున్నాయని చెబుతున్నారు. 1980ల్లో 12-13 శాతం ఉన్న వడ్డీ రేట్లు ఇవాళ 5 - 6 శాతం కూడా దాటని పరిస్థితి ఉందని, ఇలాగే కొనసాగితే ఇప్పుడు వస్తున్న పింఛన్‌లో 20 శాతం కూడా రాని పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది.

ఉద్యోగుల డబ్బు వివిధ ఫండ్స్‌లో, స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు రూపేణా ఉండడం వల్ల అవి ఒడిదుడుకులకు గురైనప్పుడల్లాం ఉద్యోగులకు అందే సీపీఎస్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుందని, రిటైర్డ్‌ ఉద్యోగికి కచ్చితంగా నెలకు ఇంత అందుతుందని చెప్పే పరిస్థితులు లేవని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు మూల వేతనంలో 50శాతం పెన్షన్‌ వచ్చేలా గ్యారంటీ పెన్షన్ విధానానికి సిఎం సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

IPL_Entry_Point