CM Jagan In Vahanmithra: ఏపీ ప్రజలు ఎన్నికల కురుక్షేత్రంలో అండగా నిలవాలన్న జగన్-ap cm jaganmohan reddy participated in the 5th year vahana mitra fund release program ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan In Vahanmithra: ఏపీ ప్రజలు ఎన్నికల కురుక్షేత్రంలో అండగా నిలవాలన్న జగన్

CM Jagan In Vahanmithra: ఏపీ ప్రజలు ఎన్నికల కురుక్షేత్రంలో అండగా నిలవాలన్న జగన్

Sarath Chandra HT Telugu
Sep 29, 2023 12:33 PM IST

CM Jagan In Vahanmithra: రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలు తనకు అండగా నిలవాలని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ వాహనమిత్ర నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎవరు అడగకున్నా, ఉద్యమించకపోయిన సంక్షేమం అందిస్తున్నట్లు చెప్పారు.

వాహన మిత్ర నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్
వాహన మిత్ర నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్

CM Jagan In Vahanmithra: వచ్చే ఎన్నికల్లో పైసా అవినీతి, లంచం, వివక్ష లేకుండా రూ.2.35లక్షల కోట్ల రుపాయలను డిబిటి ద్వారా పేదలకు పంపినీ చేసిన ప్రభుత్వానికి, ఫైబర్‌ గ్రిడ్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అసైన్డ్‌ భూముల స్కాం, అమరావతి పేరుతో చేసిన దగా, నీరు చెట్టు దోపిడి, రైతులకు చేసిన మోసాలు, అక్కచెల్లెళ్లకు చేసిన వంచించి అన్ని వర్గాలను మోసం చేసిన వారికి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.

దేవుడి దయతో వైఎస్సార్‌ వాహన మిత్ర వంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. బ్రతుకు బండి లాగడానికి ఇబ్బంది పడే ఆటో, టాక్సీ డ్రైవర్లకు, వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తూ వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. లబ్దిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు పంపుతున్నట్లు చెప్పారు.

సొంతంగా ఆటో, టాక్సీల డ్రైవర్లకు ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు తెచ్చుకోడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పథకం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఏటా పదివేలను ఆర్ధిక సాయంగా అందించాలని వైఎస్సార్ వాహన మిత్రకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. వరుసగా ఐదో ఏడాది ప్రతి డ్రైవర్‌‌కు మంచి చేస్తున్నట్లు చెప్పారు. 2,75,931 మంది డ్రైవర్లకు 275 కోట్లను వారి ఖాతాలకు బదిలీ చేయనున్నట్లు చెప్పారు. ఐదు పర్యాయాలు ఒక్కొక్కరికి రూ.50వేల రుపాయలు ప్రతి ఏటా చెల్లించినట్టు చెప్పారు.

వాహ‍నమిత్ర పథకానికి దాదాపు రూ.1300కోట్లరుపాయలు ఖర్చు చేశామన్నారు. లబ్దిదారుల కుటుంబాలకు నేరుగా పంపిణీ చేశామని, ఆటోలు, టాక్సీలు నడుపుతూస్వయం ఉపాధి కల్పించుకుంటూ నిత్యం లక్షల మందికిసేవలు అందిస్తున్నారని, పదివేల రుపాయల డబ్బుతో ఏటా కావాల్సిన పనులు చేసుకోగలుగుతారన్నారు.

వెల్లువలా సంక్షేమం…

ఇళ్లు లేని వారికి ఇళ్ల నిర్మాణం, రేషన్‌ కార్డులు మొదలుకుని ఇంటి వద్దకే పెన్షన్లు, ఇంటి దగ్గరే బర్త్‌, కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లును తమ ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటంటికి నవరత్నాల్లో సంక్షేమ కార్యక్రమాలను గడప వద్దకే చేరుస్తున్నట్లు చెప్పారు. ఇంగ్లీష్ మీడియం చదువులు పేద అక్కచెల్లెమ్మల పిల్లలకు అందుబాటులోకి తెచ్చామని, గ్రామం, వార్డుకు లంచాలు, వివక్ష లేని పారదర్శక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని, ప్రతి గ్రామం, వార్డుకు సచివాలయం తీసుకొచ్చినట్లు చెప్పారు. గ్రామాల్లో విలేజీ క్లినిక్స్‌ అందుబాటులోకి తీసుకు రావడం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ తీసుకొచ్చి, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్‌ వంటి వ్యాధులు ఉన్నా చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు.

గ్రామ, వార్డు స్థాయిలోనే మహిళా పోలీసుల్ని నియమించి, ప్రతి మహిళ ఫోన్లో దిశా యాప్‌ ఉండేలా చూస్తున్నామన్నారు. రైతులకు అండగా ఉండేలా ఆర్బీకేల ఏర్పాటు వంటి ఎవరో చెబితే చేయలేదని, 3653 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల సమస్యలను కళ్లారా చూసి సమస్యలకు పరిష్కారం వెదుకుతూ చేసినవేనన్నారు. ఆ బాధ్యత నుంచి ఈ మార్పులన్నీ పుట్టుకొచ్చాయన్నారు.

పేదల గొంతుకై నిలుస్తూ పాలన…

ఏ పేదవాడైతే, తమ కష్టాన్ని చెప్పుకోలేని స్థితిలో ఉన్న వారి గొంతుగా, వారి తరపున నిలబడుతున్న ప్రభుత్వం తమదన్నారు. అట్టడుగున ఉన్న పేదవాడు సైతం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.

రైతుల కష్టాలు తెలిసిన మనిషిగా.. రాష్ట్రంలో 62శాతం ఉన్న రైతులకు రూ. 30,980కోట్లను వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఖర్చు చేసినట్లు చెప్పారు. పంటల వేసే సమయానికి పెట్టుబడిగా ఈ డబ్బుు అందిస్తున్నట్లు చెప్పారు. ఇలా మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి ఉందా అని ప్రశ్నించారు. గొంతు వినిపించలేదని 2.43లక్షల మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా ద్వారా రూ.538కోట్ల రుపాయలను వారి చేతుల్లో పెట్టామన్నారు.

మగ్గం కదిలితే తప్ప బ్రతుకు బండి నడవని 82వేల చేనేత కార్మికులకు నేతన్న నేస్తం ద్వారా రూ.982కోట్లను అందించినట్లు చెప్పారు. రోడ్లపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారాలు చేసుకునే 17.55లక్షల మందికి వడ్డీలేని రుణాలుగా రూ.2956కోట్లను అందించినట్లు చెప్పారు. జగనన్న చేదోడుగా రజకులు, నాయిబ్రహ్మణులు, టైలర్లు వంటి 3.32లక్షల మందికి 927కోట్లను అందించినట్లు చెప్పారు.

రాష్ట్రంలో మహిళసాధికారత కోసం ఉద్యమం చేపట్టామని అందులో భాగంగానే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. గతంలో పేదలు ఎలా బ్రతుకుతున్నారో ఎవరు ఆలోచించలేదని 52నెలల 42.44లక్షల మందికి రూ.26వేల కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. విద్యాదీవెన కింద 26.99లక్షల మంది తల్లులకు రూ.11,317కోట్లను చెల్లించినట్లు చెప్పారు.వసతి మందికి 25.17లక్షల మందికి రూ.4275కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

పొదుపు సంఘాల మహిళల్ని చంద్రబాబు మోసం చేశారని, మహిళలు బ్రతకలేని స్థితిలో ఉన్నందున వారి కోసం 80లక్షల మంది అక్క చెల్లెమ్మలకు 80లక్షల మంది మహిళలకు 19,178కోట్లను చెల్లించినట్లు వివరించారు. కోటిమంది మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.5వేల కోట్ల రుపాయలు అందించి తోడుగా నిలిచినట్లు చెప్పారు. 45-60 మధ్య వయసులో మహిళల చేతిలో డబ్బులు పెడితే కుటుంబాలు బాగు పడతాయనే ఉద్దేశంతో 26.40లక్షల మంది మహిళలకు రూ. 14,129 కోట్లను వైఎస్సార్ చేయూత ద్వారా అందించినట్లు చెప్పారు.

రూ. 2029 కోట్లను కాపు నేస్తం ద్వారా అందించామని చెప్పారు. 30.76లక్షల మందికి ఇళ్ల స‌్థలాలు ఇస్తే 21.30లక్షల ఇళ్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇంతగా మహిళలకు మేలు చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. ఎవరో అడిగితే , ఉద్యమాలు చేస్తే ఈ పథకాలు అమలు చేయలేదని జగన్ చెప్పారు.

ఎన్నికల్లో అండగా నిలవండి….

కష్టాలు, సుఖాలు తెలిసిన వాడిగా సంక్షేమం అందిస్తున్నట్లు చెప్పారు. తమది మనసున్న ప్రభుత్వం అన్నారు. రానున్న ఎన్నికల్లో రేపు కురుక్షేత యుద్ధం జరుగుతుందని, మనసున్న పాలకులకు, నిరుపేదల తరపున నిలబడిన వారికి, మనసులేని వారికి, నిరుపేదల్ని వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు ప్రాంతాలకు అండగా సంక్షేమం అందిస్తున్న వారికి దోపిడీ దారులకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు.

సామాజిక అన్యాయాలు, ప్రాంతాలకు అన్యాయాలు చేయడమే చరిత్రగా ఉన్నవారికి, అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తున్న తమ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. మ్యానిఫెస్టోను ఖురాన్‌ బైబిల్, భగవద్గీత భావించి 99శాతం పూర్తి చేసిన ప్రభుత్వాని… ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే తీసుకురావాలి, తర్వాత చెత్త బుట్టలో వేయాలనుకునే వారికి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో 80ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీలకు డిబిటి ద్వారా సంక్షేమం అందించి , 83శాతం ప్ర‎భుత్వం ఉద్యోగాలు కల్పించిన వారికి, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అనే అహంకారానికి మధ్య యుద్ధం జరుగనుందన్నారు. వచ్చే ఎన్నికల గురించి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని, గతంలో కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌ ఉందని, ముఖ్యమంత్రి మాత్రమే మారిందని, అప్పులు కూడా గతంలో పోలిస్తే తక్కువేనని ఇప్పుడు బటన్‌ ఎందుకు నొక్కగలుగుతున్నాడు, నేరుగా డబ్బు ఎలా ఖాతాలకు వెళుతోందన్నారు.

ఈ డబ్బంతా గతంలో ఎవరి జేబుల్లోకి పోయిందని జగన్ ప్రశ్నించారు. అధికారం కావాల్సింది పేదలకు మంచి చేయడం కోసం కాదని, వారికి అధికారం కావాల్సింది దోచుకోడానికి, దోచుకున్నది పంచుకోడానికి ఆ తర్వాత తినడానికి అధికారం కావాలన్నారు. తనకు గజ దొంగల ముఠా తోడుగా లేదని , మీడియా దత్తపుత్రుడి అండదండలు తనకు లేవని, దోచుకుని, పంచుకుని తినడం తన విధానం కాదన, భగవంతుడు, ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు.

రాష్ట్ర అబద్దాలు నమ్మోద్దని, రానున్న రోజుల్లో ఒక్కో ఇంటికి కేజీ బంగారం, బెంజి కార్ ఇస్తామని చెబుతారని, వాటిని నమ్మొద్దన్నారు.ప్రతి ఇంట్లో మంచి జరిగితే తనకు సైనికుల్లా నిలవాలన్నారు. యుద్ధం పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతోందన్నారు. పెత్తందారి ప్రభుత్వం రాకుండా అడుగులు వేయాలన్నారు. యుద్ధంలో కులాలు, మతాలు లేవని,పేదలు ఒకవైపు పెత్తందారులు మరోవైపు ఉన్నారన్నారు. ఇలాంటి వారితో యుద్ధం జరుగుతోందని అంతా గుర్తుంచుకోవాలన్నారు.

IPL_Entry_Point