తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet-pg 2024: నీట్ పీజీ 2024 ను వాయిదా వేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

NEET-PG 2024: నీట్ పీజీ 2024 ను వాయిదా వేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

HT Telugu Desk HT Telugu

Published Aug 09, 2024 05:47 PM IST

google News
    • నీట్-పీజీ 2024 పరీక్షను రీషెడ్యూల్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆగస్ట్ 11వ తేదీన నీట్ పీజీ 2024 జరుగుతుందని స్పష్టం చేసింది. నీట్ యూజీ 2024 అవకతవకల నేపథ్యంలో, నీట్ పీజీ 2024 ను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులు పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు.
నీట్ పీజీ 2024 వాయిదా లేదు

నీట్ పీజీ 2024 వాయిదా లేదు

ఆగస్టు 11న జరగాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఐదుగురు విద్యార్థుల కోసం 2 లక్షల మంది విద్యార్థుల కెరీర్లను ప్రమాదంలోకి నెట్టలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది.


ఇప్పటికే ఒకసారి వాయిదా..

నిజానికి, నీట్ పీజీ 2024 పరీక్ష జూన్ 23న జరగాల్సి ఉంది. అయితే, జూన్ 23న జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షను నీట్ యూజీ 2024, యూజీసీ నెట్.. తదితర పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వాయిదా వేశారు. ఆ తరువాత ఆగస్ట్ 11వ తేదీన నీట్ పీజీ 2024 (neet pg 2024) ను నిర్వహిస్తామని ప్రకటించారు.

మళ్లీ వాయిదా వేయండి..

అయితే, ఆగస్టు 11వ తేదీన నీట్ పీజీ 2024 ను నిర్వహించవద్దని,, ముఖ్యంగా, పరీక్షా నగరాల కేటాయింపు ఆలస్యంగా చేశారని, అందువల్ల, పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదించారు. ముఖ్యంగా చివరి నిమిషంలో విమాన ఛార్జీలు ఎక్కువగా ఉండటం, రైలు టికెట్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది అభ్యర్థులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేకపోయారని వాదించారు.

రెండు బ్యాచ్ లతో సమస్య..

ఒక బ్యాచ్ కు మరో బ్యాచ్ కంటే క్లిష్టమైన ప్రశ్నలు వస్తే.. కష్టమైన ప్రశ్నలు వచ్చిన బ్యాచ్ కు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల సెట్లలో నిష్పాక్షికతను నిర్ధారించడానికి ఉద్దేశించిన నార్మలైజేషన్ ఫార్ములాను ముందుగానే బహిర్గతం చేయాలని వారు అభ్యర్థించారు. పరీక్షలను రెండు బ్యాచ్ లుగా నిర్వహించడంతో పాటు నార్మలైజేషన్ ఫార్ములా అభ్యర్థులకు చెప్పకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

దూరంగా పరీక్షాకేంద్రాలు..

విద్యార్థుల తరఫున అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్) అనాస్ తన్వీర్ వాదనలు వినిపించారు. నీట్ పీజీ 2024 లో పారదర్శకత లోపించడం, పరీక్షా కేంద్రాలను దూరంగా కేటాయించడం వంటి సవాళ్లు చాలా మంది విద్యార్థులకు నష్టం కలిగిస్తాయని ఆయన వాదించారు. ఒకే బ్యాచ్ లో పరీక్ష నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ ఒకే రకమైన పరీక్షాపత్రం వస్తుందని పిటిషనర్లలో ఒకరైన విశాల్ సోరెన్ సూచించారు. అయితే, నీట్ పీజీ 2024 ను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు (Supreme court) తేల్చి చెప్పింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.