తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Twitter | కొత్త సీఈఓ కోసం మస్క్​ వేట.. పరాగ్​ అగర్వాల్​ ఔట్​..!

Twitter | కొత్త సీఈఓ కోసం మస్క్​ వేట.. పరాగ్​ అగర్వాల్​ ఔట్​..!

HT Telugu Desk HT Telugu

02 May 2022, 20:02 IST

    • అమెరికా: ట్విట్టర్​కు కొత్త సీఈఓను తీసుకొచ్చేందుకు ఎలాన్​ మస్క్​ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఆ బాధ్యతల నుంచి పరాగ్​ అగర్వాల్​ తప్పుకోవాల్సిందే!
పరాగ్​ అగర్వాల్​
పరాగ్​ అగర్వాల్​ (TWITTER/file)

పరాగ్​ అగర్వాల్​

Elon Musk twitter | ట్విట్టర్​ను తన వశం చేసుకున్న అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​.. డీల్​ను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వార్త బయటకొచ్చింది. ట్విట్టర్​కు కొత్త సీఈఓను తీసుకొచ్చేందుకు మస్క్​ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రస్తుత సీఈఓ, భారత సంతతి పరాగ్​ అగర్వాల్​.. ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

ట్విట్టర్​ బృందం, సంస్థ విధానాలపై గత కొంతకాలంగా మస్క్​ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ట్విట్టర్​ ఛైర్మన్​ బ్రెట్​ టైలర్​తో మస్క్.. గత నెలలో​ సంభాషణ జరిపినట్టు, ట్విట్టర్​ మేనేజ్​మెంట్​పై తనకు నమ్మకం లేదని చెప్పినట్టు తెలిసింది. ఫలితంగా ట్విట్టర్​కు కొత్త సీఈఓ కోసం మస్క్​ అన్వేషిస్తున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి.

Parag Agarwal | పరాగ్​ అగర్వాల్​.. గతేడాది నవంబర్​లో ట్విట్టర్​ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. కాగా.. 12నెలలలోపు ఆ పదవి నుంచి తప్పిస్తే.. ఆయనకు 42మిలియన్​ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.

కొన్ని రోజుల ముందే.. ట్విట్టర్​లో తన భవిష్యత్తుపై సానుకూలంగా ఉన్నట్టు పరాగ్​ అగర్వాల్​ అభిప్రాయపడటం గమనార్హం. మస్క్​ ట్విట్టర్​ను కొనుగోలు చేసినప్పటి నుంచి పరాగ్​ అగర్వాల్​ కాస్త ఒత్తిడిలోనే ఉన్నారు. ట్విట్టర్​ సిబ్బంది ఎప్పటికప్పుడు పరాగ్​ అగర్వాల్​పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 'సంస్థలో మమ్మల్ని కొనసాగిస్తారా? లేదా?' అని అడుగుతున్నారు. వాటన్నింటికీ పరాగ్​ అగర్వాల్​.. సానుకూలంగానే జవాబులిస్తున్నారు.

<p>పరాగ్​ ట్వీట్​</p>

మరి మస్క్​.. నిజంగానే కొత్త సీఈఓను తీసుకొస్తారా? లేక పరాగ్​నే కొనసాగిస్తారా? అన్నది వేచిచూడాలి.

ట్విట్టర్​ డీల్​ ఇలా..

Elon Musk twitter deal | అసలు తెరపైకి 'డీల్​', 'ఆఫర్​' అనే పదాలు రాక ముందు.. ట్విట్టర్​లో మస్క్​ 9శాతం వాటా కొన్నారు. కొన్ని రోజుల తర్వాత.. బోర్డులోకి మస్క్​ను ట్విట్టర్​ ఆహ్వానించింది. అందుకు ఆయన కూడా అంగీకరించారు. కానీ కొన్నిరోజుల్లోనే మనసు మార్చుకుని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ట్విట్టర్​ మొత్తాన్నే కొనేందుకు ఆఫర్​ ఇచ్చారు. ఆ 44 బిలియన్​ డాలర్ల ఆఫర్​ను ట్విట్టర్​ తీసుకుంది.

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ను ఎలాన్​ మస్క్​ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. డీల్​ను పూర్తిచేసేందుకు మస్క్​ వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా.. టెస్లాకు చెందిన 9.6మిలియన్​ షేర్లను మస్క్​ అమ్మేసినట్టు సమాచారం. ఫలితంగా ఆయన.. 8.5బిలియన్​ డాలర్లను సమకూర్చినట్టు తెలుస్తోంది.

టాపిక్