తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Vijayawada Commissioner: అసమర్థతపై ఈసీ వేటు.. అంట కాగినందుకు కాంతిరాణా చెల్లించిన మూల్యం...

Vijayawada Commissioner: అసమర్థతపై ఈసీ వేటు.. అంట కాగినందుకు కాంతిరాణా చెల్లించిన మూల్యం...

Sarath chandra.B HT Telugu

24 April 2024, 9:08 IST

    • Vijayawada Commissioner: విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా తాతాపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై విజయవాడలో యువకుడు రాయి దాడి నేపథ్యంలోనే ఈసీ వేటు వేసినా, సీపీ బదిలీ విషయంలో ప్రతిపక్షాల ఫిర్యాదులు కూడా బలంగానే పనిచేశాయి.
విజయవాడ పోలీస్ కమిషనర్‌  కాంతిరాణాపై ఈసీ వేటు
విజయవాడ పోలీస్ కమిషనర్‌ కాంతిరాణాపై ఈసీ వేటు

విజయవాడ పోలీస్ కమిషనర్‌ కాంతిరాణాపై ఈసీ వేటు

Vijayawada Commissioner: విజయవాడ పోలీస్ కమిషనర్‌ Kanthi Rana Tata కాంతి రాణా తాతాపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌ నుంచి అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చినPolice Commissioners పోలీస్ కమిషనర్ల జాబితాలో కాంతిరాణా కూడా చేరారు. Election Schedule ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి Election Commission ఎన్నికల సంఘానికి ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేస్తున్న నేతల జాబితాలో కాంతి రాణా కూడా ఉన్నారు. విపక్షాల ఫిర్యాదులు, ముఖ్యమంత్రిపై దాడి… అన్నీ కలిసి CP సీపీపై వేటు పడింది.

ట్రెండింగ్ వార్తలు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

దాదాపు మూడేళ్లుగా విజయవాడ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కాంతి రాణా పనితీరుపై ఇన్నాళ్లు విమర్శలు ఉన్నా రాజకీయ అండదండలతో విజయవాడలోనే కొనసాగారు. ఒరిస్సాలో విధులు నిర్వహిస్తున్న ఆయన భార్యను కూడా ఏపీ ప్రభుత్వంలో పోస్టింగ్ ఇప్పించుకున్నారు.

రాయలసీమ రేంజ్‌ నుంచి విజయవాడ సీపీగా బాధ్యతలు చేపట్టిన కాంతిరాణా రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు విజయవాడ కమిషనరేట్‌లో ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు. లా అండ్‌ ఆర్డర్ మీద కంటే ట్రాఫిక్‌ విషయాల మీదే కాంతిరాణాకు ఆసక్తి ఎక్కువ ఉంటుందని, క్రైమ్, అడ్మినిస్ట్రేషన్‌, పోలీస్‌ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలనేదే లేకుండా పదవీ కాలం మొత్తం గడిపేశారని విమర్శ ఆయనపై ఉంది. తాజాగా సిఎంపై దాడి నేపథ్యంలో ఈసీ ఆయనపై వేటు వేసింది.

రాజకీయ సిఫార్సులతో పోస్టింగ్…

ఏపీ ప్రభుత్వంలో కీలక మంత్రి సిఫార్సుతో విజయవాడలో పోస్టింగ్ దక్కించు కున్నట్టు ప్రచారం ఉంది. రెండేళ్ల క్రితం విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినపుడే ఆయనపై వేటు పడుతుందని ప్రచారం జరిగింది. అదృశ్య శక్తులు అడ్డు పడటంతో ఆయన సురక్షితంగా పదవిలో కొనసాగారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న మాజీ పోలీస్ ఉన్నతాధికారి ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో ఆయనకు ఎలాంటి ముప్పు రాకుండా కాపాడుకున్నారని పోలీస్ శాఖలో ప్రచారం ఉంది. రాజకీయ నేతలకు పూర్తిగా లొంగిపోయి పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మానవ అవయవాల అక్రమ మార్పిడి వ్యవహారం వెలుగు చూసినా నిందితుల్ని కాపాడేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఫిర్యాదులు లేవనే కారణంతో అక్రవ అవయవాల విక్రయ ముఠాకు అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి.

పనితీరు అంతంతే...

విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నగరంలో నేరాల నియంత్రణ మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదనే విమర‌్శలు ఎదుర్కొన్నారు. కమిషనరేట్‌ నుంచి కాలు బయటకు పెట్టకుండా కాలం గడిపేశారు. గంజాయి ముఠాలు, బ్లేడ్‌ బ్యాచ్‌లు చెలరేగిపోయినా చూసి చూడనట్టు వదిలేశారు.

కృష్ణలంక పోలీస్ స్టేషన్‌‌లో విధుల్లో ఉన్న ఎస్సై మీద రాజకీయ నాయకుడు దాడి చేసినా కనీసం పెదవి విప్పే సాహసం చేయలేదు. స్టేషన్‌లో ఉన్న నిందితుల్ని విడిపించుకునే క్రమంలో ఎంపీ నందిగం సురేష్‌ పోలీస్ స్టేషన్‌లో వీరంగం వేసినా తనకు ఏమి తెలియదన్నట్టు సీపీ నటించారు.

విజయవాడ కేంద్రంగా మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా యథేచ్చగా సాగినా వాటిని నియంత్రించే ప్రయత్నాలు ఏమాత్రం చేయలేదు. గత కొన్నేళ్లుగా చోరీ కేసుల్లో రికవరీలు గణనీయంగా పడిపోయాయి. బంగారం చోరీ కేసుల్లో రికవరీలు దారుణంగా పడిపోయాయనే అపప్రదను బెజవాడ పోలీసులు మూట గట్టుకున్నారు. 498 వంటి కేసుల్లో స్టేషన్ బెయిళ్లకు కూడా విజయవాడలో రేట్ ఫిక్స్ చేశారని తెలిసినా చూసి చూడనట్టు వదిలేశారు.

పెరిగిన క్రైమ్ రేట్…

విజయవాడలో గత కొన్నేళ్లుగా మహిళల అక్రమ రవాణా, ఈశాన్య రాష్ట్రాల మహిళలతో మసాజ్ పార్లర్ల దందా సాగుతోంది. ఇవన్నీ అయా పోలీస్ స్టేషన్లకు తెలిసే జరుగుతున్నా ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారు. దీంతో డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి విజయవాడ పోలీసులకు తెలియకుండా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిబ్బందితో దాడులు చేయించారు. ఏక కాలంలో డజనుకు పైగా పార్లర్లను సీజ్ చేశారు. ఇవన్నీ స్థానిక పోలీసుల అండదండలతోనే సాగుతున్నాయని గుర్తించారు. విజయవాడ పోలీసుల పనితీరుపై అసంతృప్తి ఉన్నా, రాజకీయ అండదండలు ఉండటంతో డీజీపీ కూడా చూసి చూడనట్టు వ్యవహరించారు.

విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో గతంలో యాంటీ గుండా స్క్వాడ్‌ అరాచక శక్తుల్ని, నేరస్తుల్ని గడగడలాడించేది. సీపీగా కాంతి రాణా బాధ్యతలు చేపట్టిన తర్వాత అది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఏజీఎస్‌ను టాస్క‌‌ఫోర్స్‌గా మార్చిన తర్వాత అది ఏమి చేస్తుందో కూడా తెలియకుండా పోయింది. టాస్క్‌ఫోర్స్‌ విధుల్లో చాలా బాధ్యతల్ని సెబ్‌కు అప్పగించారు. దీంతో అది నామమాత్రంగా మారిపోయింది.

గత ఏడాది వెలుగు చూసిన సంకల్పసిద్ధి స్కామ్‌లో వందలకోట్ల రుపాయల్ని ప్రజలు పోగొట్టుకున్నారు. ఈ కేసులో నిందితుల్ని కాపాడటంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారికి సంబంధించిన వీడియో ఆధారాలు దొరికినా చూసి చూడనట్టు వదిలేశారు. ఆర్ధిక నేరాల నియంత్రణ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మీడియా కోసం ప్రత్యేక ప్రదర్శనలు…

విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించే స్పందన, డయల్ యువర్ సీపీ వంటి కార్యక్రమాల్ని మీడియా షోలుగా మార్చేశారు. ఏనాడు వాటిలో పాల్గొనకపోయినా సీపీ స్వయంగా ప్రజా సమస్యల్ని విన్నట్టు పత్రికల్లో వార్తలు రాయించుకునే వారు.

ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారుల్ని తప్ప సామాన్యులకు సీపీని కలిసే అవకాశమే లేకుండా చేశారు. పదేళ్ల క్రితం వరకు విజయవాడలో సీపీలుగా పనిచేసిన అధికారులు నిత్యం ఏదో ఒక సమయంలో ప్రజల్ని నేరుగా కలుసుకునే వారు. వారి ఫిర్యాదులు, బాధలు అడిగి తెలుసుకునే వారు.

పోలీస్ స్టేషన్ల వారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టేవారు. బెదిరింపులు, దౌర్జన్యాల విషయంలో కాస్తోకూస్తో కఠినంగా వ్యవహరించే వారు. సీపీగా కాంతిరాణా మాత్రం తన ఛాంబర్‌ నుంచి అడుగుపెట్టిన సందర్భాలు అరుదుగా ఉండేవి. దసరా ఉత్సవాలు, విఐపి ప్రోటోకాల్ ఉన్నపుడు మాత్రమే బయట కనిపించే వారు.

నందిగామలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారంలో కాన్వాయ్‌పై రాళ్ల దాడిలో చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ తీవ్రంగా గాయపడినా పూలతో పాటు రాళ్లు పడుంటాయని ఎగతాళి చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీతో అంటకాగుతున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన అధికారుల జాబితాలో కాంతి రాణా పేరు కూడా ఉంది.

తదుపరి వ్యాసం