తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Srivari Darshan Tickets Schedule Released Every Month 18 To 26 Different Tickets Releases

Tirumala Tickets Schedule : శ్రీవారి భక్తులకు అలర్ట్- ఆర్జిత సేవ, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల

17 May 2023, 21:55 IST

    • Tirumala Tickets Schedule : తిరుమల శ్రీవారి సేవా, దర్శనం టికెట్ల షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది. ప్రతి నెల 18 నుంచి 26 మధ్య దర్శనం, ఆర్జిత సేవలతో పాటు పలు టికెట్లను విడుదల చేయనున్నారు.
తిరుమల
తిరుమల (Twitter )

తిరుమల

Tirumala Tickets Schedule : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూల్ విడుదల చేసింది. దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, గదుల కోటా వంటి టికెట్లు కోసం భక్తులు ఎదురు చూడాల్సిన పనిలేదని, ఇకపై ప్రతి నెలా నిర్ణీత తేదీల్లోనే తర్వాతి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన తెలిపింది.

24న స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి. అదేవిధంగా రూ.300 దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఇక నుంచి దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటాను ఆన్‌లైన్‌లో ఒక షెడ్యూల్ ప్రకారం విడుదల టీటీడీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది.

తిరుమలలో భక్తుల రద్దీ-సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు తిరుమల కొండ కిటకిటలాడుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో దాదాపుగా అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. మంగళవారం స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకోగా 38,980 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా నిన్న శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు అని టీటీడీ తెలిపింది.