YCP vs TDP: కుప్పంలో టెన్షన్… బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ
25 August 2022, 10:48 IST
- చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్లదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కుప్పంలో టెన్షన్ వాతావరణం
High Tension at Kuppam:టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం పలుచోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణల మధ్య వాగ్వాదం జరగగా... కొన్నిచోట్ల రాళ్ల దాడి జరిగింది. ఇదిలా ఉంటే ఇవాళ కూడా చంద్రబాబు పర్యటన ఉండటంతో... అడ్డుకుంటామంటూ వైసీపీ శ్రేణులు హెచ్చరకలు జారీ చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితులు నెలకొన్నాయి.
కుప్పం బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది. మరోవైపు చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. వైసీపీ, టీడీపీ వర్గాలు బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. భారీ నిరసన ప్రదర్శనకు తరలి రావాలంటూ వైసీపీ క్యాడర్ కు పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైయస్సార్ విగ్రహం వరకు వైసిపి నిరసన ప్రదర్శన చేయనుంది. ఇదిలా ఉంటే చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు.
ycp call for kuppam bandh: వైసీపీ బంద్కు పిలుపునివ్వడంతో ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కుప్పం పరిధిలోని ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో పలుచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు చేపట్టారు. ఇరు పార్టీల కార్యకర్తలను నియంత్రించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
బుధవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు... వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. ఒక్క సీటు కూడా నెగ్గలేరని పేర్కొన్నారు. పులివెందులలోనూ వైసీపీని భూస్థాపితం చేస్తానని సవాల్ విసిరారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పులివెందులను కుప్పంగా మార్చాలని ప్రయత్నిస్తే... ప్రస్తుతం సీఎం పులివెందులలా కుప్పంను మార్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఏళ్లుగా టీడీపీ జెండా ఎగిరిన గడ్డ కుప్పం అన్న చంద్రబాబు ఈ నియోజకవర్గాన్ని పులివెందులలా మార్చలేరని స్పష్టం చేశారు. వైసీపీ రౌడీ రాజకీయాలకు భయపడనని అన్నారు. నీతి, న్యాయానికి తప్ప దేనికీ భయపడనని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ అవినీతి సొమ్మంతా కక్కిస్తామని వ్యాఖ్యానించారు.