CM Jagan : కుప్పం నుంచే మెుదలు.. 175 అసెంబ్లీ స్థానాలు టార్గెట్
వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేయాలని వైసీపీ అనుకుంటోంది. ఇప్పటికే ఇదే విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. దాని కోసమే ప్రణాళికలు వేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో భేటీలు వేస్తున్నారు.
'మనం మంచి పనులు చేస్తే.. 175 స్థానాలకు 175 స్థానాలు ఎందుకు గెలవం.' ఇటీవల ఓ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ అన్నమాటలివి. అలా అన్ని స్థానాలు గెలిస్తే.. ఇంకా మంచి మంచి పనులు చేయోచ్చని చెప్పారు. ఇప్పుడు దానిపైనే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై సీఎం జగన్ పూర్తిగా కాన్సట్రేట్ చేశారు. ఎమ్మెల్యేల నివేదికలు తెప్పించుకుని వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో మాత్రమే భేటీలు వేస్తే.. చాలదనుకున్న జగన్.. ఇప్పుడు నేరుగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఆగస్టు 4 నుంచి ఈ కార్యక్రమం మెుదలు. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం నుంచే ప్లాన్ చేశారు. కుప్పం నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలు తాడేపల్లిలో జగన్ తో భేటీ అవుతారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి వివరిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిపై కూడా జగన్ ఆరా తీస్తారు. ఎలా చేస్తే.. ముందుకు వెళ్తామనే అంశంపై మాట్లాడతారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉందో అడిగి తెలుసుకోనున్నారు. కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు పార్టీలో మంచి మంచి అవకాశాలు ఇస్తామని ఈ సందర్భంగా సీఎం చెప్పానున్నారు.
మిషన్ 175 లక్ష్యంతో చంద్రబాబు ఓడించాలని వైసీపీ అనుకుంటోంది. ఇప్పటికే కుప్పంలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో క్యాడర్ లో జోష్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవాలని.. దానికోసం కష్టపలాని కార్యకర్తలకు జగన్ సూచించనున్నారు. కిందటి సారి కోల్పోయిన స్థానాల్లో జగన్ ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.
ప్రభుత్వంపై చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలను బూత్ స్థాయి నుంచే తిప్పికొట్టాలని కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీనికోసం సోషల్ మీడియాను గట్టిగా వాడుకోవాలని సూచనలు చేయనున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా.. పార్టీ అండగా ఉంటుందని.. భరోసా ఇవ్వనున్నారు.