Rain Alert To AP : మరో రెండురోజులు ఏపీలో భారీ వర్షాలు
09 October 2022, 20:45 IST
- Weather Update To Andhra Pradesh : ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
ఏపీలో వర్షాలు
Andhra Pradesh Weather News : ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్ 11 మంగళవారం వరకు ఏపీలోని అన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
తమిళనాడు వైపు నుంచి వస్తున్న అల్పపీడనం ప్రభావం మొదలైంది. దీని ప్రభాంతో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని ఐఎండీ(IMD) వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోనూ వర్షాలు పడతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా, కృష్ణా, కొనసీమ(Konaseema) జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ భాగాలు, గుంటూరు, పల్నాడు, ఎన్.టీ.ఆర్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ(Rayalaseema)లో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్షాల కారణంగా వరదలు, ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లడం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం(State Govt) అన్ని జిల్లాల పాలనా యంత్రాంగాలను ఆదేశించింది. విజయనగరం, బాపట్ల(Bapatla), సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో విజయనగరం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన వర్షం శనివారం ఉదయం వరకు కొనసాగింది.
విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో గత 24 గంటల్లో అత్యధికంగా 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే కాలంలో రాష్ట్రంలోని మొత్తం 679 మండలాల్లో 34 మండలాల్లో అధిక వర్షపాతం, 185 మండలాల్లో అధిక, 386 మండలాల్లో సాధారణం, 74 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి శనివారం వరకు రాష్ట్రంలో సగటున 642 మి.మీ వర్షపాతం నమోదైంది.