Chandrababu Kuppam Tour: మిస్టర్ జగన్ రెడ్డి.. దమ్ముంటే కుప్పంకు రావాలి
25 August 2022, 12:42 IST
- Chandrababu Protest In Kuppam: కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తంగా మారింది. వైసీపీ శ్రేణలు అడ్డుకోవటంతో పాటు అన్నా క్యాంటీన్ పై దాడి చేశారు. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు
High Tension at Kuppam:సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవటం, అన్నా క్యాంటీన్ పై దాడి చేయటంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఓ వైపు టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. టీడీపీ ఫ్లెక్సీలను చించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు.
Chandrababu Fires on CM Ys Jagan: ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.... కుప్పం చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని అన్నారు. కుప్పంలో ఎప్పుడైనా రాడీయిజం చూశారా అన్న ఆయన... ఇవాళ తనపైనే దాడికి యత్నించారని ఆరోపించారు. మిస్టర్ ఎస్పీ ఎక్కడ ఉన్నావ్ అంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఇంటిపై దాడి చేయడానికి నిమిషం పట్టదని చంద్రబాబు హెచ్చరించారు. మిస్టర్ జగన్ రెడ్డి... దమ్ముంటే కుప్పానికి రావాలని సవాల్ విసిరారు. 'నీ దగ్గర 60 వేల మంది పోలీసులు ఉంటే నా దగ్గర 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. జిల్లా ఎస్పీనే ఫ్లెక్సీలను ధ్వంసం చేయించాడు. ధర్మపోరాటం ఇక్కడ్నుంచే ప్రారంభిస్తున్నాను. నేను బ్రతికున్నంత వరకు కుప్పంలో మీరేం చేయలేరు' అని స్పష్టం చేశారు.
Chandrababu Kuppam Tour:టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం పలుచోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణల మధ్య వాగ్వాదం జరగగా... కొన్నిచోట్ల రాళ్ల దాడి జరిగింది. ఇదిలా ఉంటే ఇవాళ కూడా చంద్రబాబు పర్యటన ఉండటంతో... అడ్డుకుంటామంటూ వైసీపీ శ్రేణులు హెచ్చరికలు జారీ చేశారు.
కుప్పం బంద్ కు కూడా వైసీపీ పిలుపునిచ్చింది. మరోవైపు చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. వైసీపీ, టీడీపీ వర్గాలు బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. భారీ నిరసన ప్రదర్శనకు తరలి రావాలంటూ వైసీపీ క్యాడర్ కు పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైయస్సార్ విగ్రహం వరకు వైసిపి నిరసన ప్రదర్శన చేపట్టింది.
ycp call for kuppam bandh: వైసీపీ బంద్కు పిలుపునివ్వడంతో ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కుప్పం పరిధిలోని ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో పలుచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు చేపట్టారు. ఇరు పార్టీల కార్యకర్తలను నియంత్రించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.