తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Residential School Entrance Test Results Released

APRS Results: ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్‌ టెస్ట్ ఫలితాలు విడుదల..

HT Telugu Desk HT Telugu

09 June 2023, 10:01 IST

    • APRS Results: ఆంధ‌్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన  ప్రవేశపరీక్ష  ఫలితాలు విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారికి త్వరలో అడ్మిషన్లు చేపట్టనున్నారు. 
ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫలితాలు విడుదల
ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫలితాలు విడుదల

ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫలితాలు విడుదల

APRS Results: ఆంధ్రప్రదేవ్ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఎంట్రన్స్‌ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు.

ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో 38 పాఠశాలలు, 7 జూనియర్‌ కాలేజీలు, ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ఉన్న 3,195 సీట్లతో పాటు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న 356 ఖాళీల భర్తీ చేయనున్నారు. దీంతో పాటు ఇంటర్‌లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ/సీఈసీ విభాగాల్లో ఉన్న 1,149 సీట్లకు, డిగ్రీలోని బీఏ, బీకాం, బీఎస్సీలోని 4,852 సీట్లకు గత నెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు తెలిపారు.

విద్యార్థుల ర్యాంకులను వారి మొబైల్‌ నంబర్లతో పాటు వారి పాఠశాలలకు కూడా పంపించామని, https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో కూడా ఉంచామన్నారు. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 87,252 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు హాజరైన వారికి ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

ఎంట్రన్స్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలోని 12 మైనార్టీ పాఠశాలలు, 3 జూనియర్‌ కాలేజీల్లో మైనార్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా నేరుగా అడ్మిషన్లు చేపట్టనున్నారు.

ర్యాంకులు సాధించింది వీరే…

గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ఇంటర్, డిగ్రీ కాలేజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 150 మార్కులకు నిర్వహించారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించి తొలి స్థానంలో నిలిచిన అభ్యర్థుల పేర్లను గురుకుల విద్యాలయ సంస్థ వెల్లడించింది.

ఐదో తరగతి ప్రవేశ పరీక్షలో విజయనగరం జిల్లాకు చెందిన బి.దిలీప్‌ కృష్ణ 99 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆరో తరగతిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి.జితేంద్రకుమార్‌ , ఏడో తరగతిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జీకే సాయిపవన్‌, ఎనిమిదో తరగతిలో కృష్ణా జిల్లాకు చెందిన కె.నవీన్‌ కుమార్‌ మొదటి స్థానం సాధించారు.

ఇంటర్‌ కేటగిరీలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కె.సాయి సృజన ఎంపీసీ విభాగంలో 146 మార్కులు సాధించింది. టీ సాహితి బైపీసీలో 140 మార్కులు సాధించింది. విజయనగరం జిల్లాకు చెందిన కేవీ.వంశీకృష్ణ నాయుడు ఎంఈసీ/సీఈసీలో 133 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు.

డిగ్రీ విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.అచ్యుతరావు (బీఏ), విజయనగరం జిల్లాకు చెందిన ఎం.జ్ఞానతేజ (బీకాం), టి.పునీత్‌ కుమార్‌ (బీఎస్సీ-ఎంఎస్‌సీఎస్‌, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎస్‌.తేజ (బీఎస్సీ-ఎంపీసీ) విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించినట్లు ప్రకటించారు.