TS Electricity Charges: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. హైటెన్షన్ వర్గాలకు కరెంట్ చార్జీలను హేతుబద్ధీకరించడంతో పాటు, వివిధ వర్గాలకు కనెక్షన్లపై వేసే ఫిక్సిడ్ ఛార్జీలను పెంచాలని.. విద్యుత్ పంపిణీ సంస్థలు చేసిన ప్రతిపాదనలను టీజీ ఈఆర్సీ తిరస్కరించింది. విద్యుత్ బిల్లుల్లో కనీస నెలవారీ చార్జీల విధానాన్ని తొలగించాలని ఆదేశించింది.
800 యూనిట్లకు పైబడి విద్యుత్ వినియోగించేవారికి మాత్రం స్థిరచార్జీలను ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.50కి పెంచడానికి అనుమతిచ్చింది. ఈఆర్సీ నిర్ణయం నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్లు దాఖలు చేసిన వార్షిక ఆదాయం, అవసరాల వివరాలపై అక్టోబర్ 23, 24 తేదీల్లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించింది. విద్యుత్ ధరలపై దాఖలైన 8పిటిషన్లపై సోమవారం ఉత్తర్వులు వెలువరించింది.
కరెంటు చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించింది. చార్జీల పెంపు ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల ఆదాయం పెంచుకోడానికి అనుమతి కోరగా అందులో రూ.1170 కోట్లు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో రూ.30 కోట్ల వరకు మాత్రమే ఛార్జీల సవరణకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది.
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను దాదాపుగా తిరస్కరించినట్లు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారు. ఈఆర్సీ సభ్యులు మనోహర్రాజు, కృష్ణయ్యలతో కలిసి ఉత్తర్వులను వెలువరించారు.