ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించటంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. 30 - 35 ప్రశ్నల ఆధారంగా వివరాలను సేకరించి.. ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తున్నారు. అన్ని కోణాల్లో వివరాలను క్రోడీకరించి… అసలైన అర్హులకే స్కీమ్ ను వర్తింపజేయనున్నారు.
గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. గ్యారెంటీ పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికను జోడించి… లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా సర్వే చేయిస్తోంది.
ఈ స్కీమ్ కింద గృహనిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిచనుంది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ పకడ్బందీగా అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అయితే ఒకే ఆధార్ నెంబర్ తో వేర్వురు ప్రాంతాల్లో చేసిన దరఖాస్తులను గుర్తించేందుకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను వినియోగించుకుంటోంది. ఫలితంగా ఏదో ఒక చోట స్వీకరించిన దరఖాస్తును మాత్రమే పరిణనలోకి తీసుకునే పనిలో పడింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సర్వే జరుగుతోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తోంది. యాప్ లో దరఖాస్తుదాడికి ఫొటోలతో పాటు ప్రస్తుతం ఉన్న ఇళ్లు, ఖాళీ స్థలం చిత్రాలను కూడా అప్ లోడ్ చేస్తోంది.
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇళ్ల మంజూరు కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఈ సమయంలో దరఖాస్తు చేసుకోలేని వారు ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలనే దానిపై గందరగోళానికి గరువుతున్నారు. అయితే కొత్తగా కూడా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఇటీవలే గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ప్రజాపాలన లో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి అప్లికేషన్లను స్వీకరించింది. మరోసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రకటిస్తే… అందులో ఇందిరమ్మ ఇంటికోసం అప్లికేషన్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం