తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు మంత్రులతో కలిసి సమీక్షించారు.
ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు.