Ponguleti Srinivas Reddy : ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై కేబినెట్ లో చర్చ, కేటీఆర్ అరెస్టుపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యల-tg formula e race funds transfer issue minister ponguleti says governor approval to probe ktr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ponguleti Srinivas Reddy : ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై కేబినెట్ లో చర్చ, కేటీఆర్ అరెస్టుపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యల

Ponguleti Srinivas Reddy : ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై కేబినెట్ లో చర్చ, కేటీఆర్ అరెస్టుపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యల

Ponguleti Srinivas Reddy : ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తుంది. నిధుల బదలాయింపుపై కేబినెట్ లో చర్చ జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనన్నారు.

ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై కేబినెట్ లో చర్చ, కేటీఆర్ అరెస్టుపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యల

Ponguleti Srinivas Reddy : ఫార్ములా ఈ-రేస్ నిధుల బదలాయింపుపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిధుల బదలాయింపుపై విచారణకు ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలిపారన్నారు. ఈ వ్యవహారంపై సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామన్నారు. ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంలో చట్టప్రకారమే దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరామని, అందుకు గవర్నర్ న్యాయ నిపుణుల అనుమతి తీసుకుని అనుమతి ఇచ్చారన్నారు.

ఈ దస్త్రాన్ని ఇవాళ రాత్రి, లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి పంపిస్తారన్నారు. నిధుల దుర్వినియోగంపై చట్టప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. గవర్నర్‌ అనుమతిపై కేబినెట్‌లో చర్చ జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీపై కేబినెట్ చర్చిందన్నారు. కేటీఆర్‌ అరెస్టుపై తానేమీ చెప్పలేనన్నారు. చట్టం తన పని తాను చేసుందని తెలిపారు. కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందనడం బీఆర్ఎస్ అహంకారపురిత మాటలకు నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కక్ష పూరితంగా వ్యవహరించడం లేదని, తప్పులను బయటకు తీసి చర్చలో పెట్టామన్నారు. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కూడా చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.

అమరావతిపై కీలక వ్యాఖ్యలు

అమరావతిలో వరదలతో ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరదలతో ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టగానే రియల్ ఎస్టేట్ అమరావతికి పోతుందనేది ప్రచారం మాత్రమేనన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ పడిపోలేదన్నారు. హైదరాబాద్‌, బెంగళూరుకు పెట్టుబడిదారులు వస్తున్నారన్నారు.

ఫార్ములా ఈ-రేస్ వివాదం

కొద్దిరోజులు కిందటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. పలు అంశాలపై చర్చించగా… ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై న్యాయసలహా తీసుకున్న రాజ్ భవన్ కార్యాలయం.. తాజాగా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్ పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూడా వచ్చింది. ఇది సక్సెస్ కావటంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి(సెషన్‌-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్‌(ఎఫ్‌ఈవో)తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.

రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా.. అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్‌ఈవోకు చెల్లించిన రూ. 55 కోట్లపై విచారణకు ఆదేశించింది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించాలని గుర్తుంచింది. విదేశీసంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహారించినట్లు ప్రాథమికంగా గుర్తించటంతో ఈ మొత్తం వ్యవహారపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసును ఏసీబీకి చేతికి అప్పగించింది.

సంబంధిత కథనం