Bandi Sanjay Comments: కొత్త సచివాలయం డోమ్లు కూల్చివేస్తాం
Bandi Sanjay Comments on New Secretariat: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే…నూతన సచివాలయ టూంబ్స్ (డోమ్లు)ను కూల్చేస్తామని అన్నారు. నిజాం వారసత్వ సంస్కృతి ధ్వంసం చేస్తామని వ్యాఖ్యానించారు.
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.... నూతన సచివాలయ టూంబ్స్ (డోమ్లు)ను కూల్చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జనం గోస – బీజేపీ భరోసాలో భాగంగా కూకుట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినిపల్లిలో తలపెట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తామని... నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామన్నారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామని కామెంట్స్ చేశారు.
"ప్రగతి భవన్ ను ప్రజా దర్భార్ లా మారుస్తాం. తెలంగాణలో నిజాం వారసత్వ మరకలను సమూలంగా తుడిచివేస్తాం. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే సచివాలయాన్ని తాజ్ మహల్ లాంటి సమాధిలా మార్చారు. రోడ్డుకు అడ్డం ఉంటే మసీదులు, మందిరాలు కూలుస్తామన్న కేసీఆర్ దమ్ముంటే... పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చాలి. అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నాటకం ఆడుతున్నాయి" అని బండి సంజయ్ మండిపడ్డారు.
కూకట్ పల్లి లో పేదల భూములను కబ్జా చేశారని.. ప్రశ్నించివారిపైనే తిరిగి కేసుపు పెడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడతామని... ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీ కి పట్టం కడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మూర్ఖత్వ పాలనను ప్రజలకు వివరించేందుకే ఈ మీటింగ్ లు ఏర్పాటు చేశామన్నారు. మోదీ పాలనా విజయాలను వివరిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారని.. ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.. ఈ రోజుకీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆదాయంలో60 శాతం హైదరాబాద్ నుండే వస్తోందని... అలాంటి హైదరాబాద్ ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దుర్మార్గులు, దుష్టులు ఇద్దరు ఏకమై బీజేపీ కి మేయర్ పదవి రాకుండా చేశారని ఆరోపించారు.
"మూతపడ్డ ఫైనాన్స్ దుకాణానికి కొత్త పేరు పెట్టి తెరిచినట్లుగాట బీఆర్ఎస్ వ్యవహారం ఉంది. కేసీఆర్ ఎక్కడి కి వెళ్ళిన అబద్ధాలు చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం 3 కోట్ల ఇండ్లు ఇచ్చింది. కేసీఆర్ ఎంత మందికి డబల్ బెడ్రూం లు ఇచ్చారో? చెప్పాలి. అన్ని ఛార్జ్ లను పెంచిన కేసీఆర్ భూముల కబ్జాతో వేల కోట్లు సంపాదిస్తున్నారు. వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు" అని బండి సంజయ్ అన్నారు.
ఇప్పటికే ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ఇదిలా ఉండగానే బండి సంజయ్.. కొత్త సచివాలయంపై కామెంట్స్ చేయటం చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం