Siddipet Crime: సిద్దిపేటలో దారుణం.. ఆడిస్తానని తీసుకెళ్లి మూడేళ్ళ చిన్నారిపై యువకుడి అత్యాచారం-atrocity in siddipet a young man raped a three year old girl by taking her to play ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Crime: సిద్దిపేటలో దారుణం.. ఆడిస్తానని తీసుకెళ్లి మూడేళ్ళ చిన్నారిపై యువకుడి అత్యాచారం

Siddipet Crime: సిద్దిపేటలో దారుణం.. ఆడిస్తానని తీసుకెళ్లి మూడేళ్ళ చిన్నారిపై యువకుడి అత్యాచారం

HT Telugu Desk HT Telugu

Siddipet Crime: సిద్దిపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అభంశుభం తెలియని మూడేళ్ళ చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లి ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన సిద్దిపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన జరిగిన 24 గంటలలోనే నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

సిద్దిపేటలో మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అజయ్

Siddipet Crime: సిద్దిపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అభంశుభం తెలియని మూడేళ్ళ చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లి ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన సిద్దిపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన జరిగిన 24 గంటలలోనే నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు .

త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణం మైత్రివనం నందు నిర్మిస్తున్న గో గ్రీన్ అపార్ట్మెంట్ లో నేపాల్ కు చెందిన వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా మూడేళ్ళుగా పనిచేస్తున్నాడు.

అతడితో పాటు తన భార్య, మనవరాలితో అక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా అదే అపార్ట్మెంట్ లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ జిల్లా రసూల్ పురా గ్రామానికి చెందిన అజయ్ (30) పెయింటింగ్ పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో అజయ్ ఈ నెల 19న మధ్యాహ్నం వాచ్ మెన్ మనవరాలిని ఆడిస్తానని కుటుంబీకులతో చెప్పి సమీపంలోని రూంలోకి తీసుకొని వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడుస్తుండడంతో నిందితుడు పరారయ్యాడు. బాలికపై అకృత్యానికి పాల్పడి బాధిత కుటుంబానికి మాటల్లో వర్ణించలేని వేదనను మిగిల్చాడు.

మనవరాలి రోదన విన్న చిన్నారి తాత అక్కడికి వెళ్ళి చూసి హతాశుడయ్యాడు. వెంటనే మనవరాలిని ఎత్తుకొని వచ్చి అక్కడున్న వారికీ విషయం తెలిపాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

అనంతరం పాపను వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ నెల 20న పొన్నాల బ్రిడ్జ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని జ్యుడీషియల్ రిమాండ్ తరలించామని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు.

చికిత్స పొందుతున్న పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించినట్లు సీఐ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా కేసును అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు సమర్పిస్తామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ స్పష్టం చేసారు.