Manish Sisodia: సుప్రీం కోర్టుకు మనీశ్ సిసోడియా.. 'సీబీఐ అరెస్టు'పై సవాల్.. నేడే విచారణ-manish sisodia moves supreme court against arrest by cbi in delhi liquor scam ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Manish Sisodia Moves Supreme Court Against Arrest By Cbi In Delhi Liquor Scam

Manish Sisodia: సుప్రీం కోర్టుకు మనీశ్ సిసోడియా.. 'సీబీఐ అరెస్టు'పై సవాల్.. నేడే విచారణ

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 28, 2023 12:03 PM IST

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అరెస్టును సవాల్ చేశారు.

Manish Sisodia: సుప్రీం కోర్టుకు మనీశ్ సిసోడియా.. సీబీఐ అరెస్టుపై సవాల్
Manish Sisodia: సుప్రీం కోర్టుకు మనీశ్ సిసోడియా.. సీబీఐ అరెస్టుపై సవాల్ (HT_PRINT)

Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) నేత మనీశ్ సిసోడియా.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Scam Case) లో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court)లో మంగళవారం (ఫిబ్రవరి 28) పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఈ పిటిషన్ అత్యవసర విచారణకు అంగీకరించారు. నేటి మధ్యాహ్నం 3.50 గంటలకు ధర్మాసనం ఈ పిటిషన్‍ను విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ ఆదివారం రోజున అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని ఓ స్పెషల్ కోర్టు ఆయనకు 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ అరెస్టును సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీం కోర్టుకు సిసోడియా వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు..

Manish Sisodia: హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని సిసోడియా తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్విని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో వినోద్ దువా కేసును సింఘ్వి ఉటంకించారు. దీంతో సిసోడియా పిటిషన్ అత్యవసర విచారణకు సీజేఐ అంగీకరించారు. మధ్యాహ్నం 3.50 గంటలకు వాదనలు వింటామని తెలిపారు.

కొవిడ్-19 మహమ్మారి నియంత్రణ అంశంలో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించిన విషయంలో జర్నలిస్టు వినోద్ దువాపై దాఖలైన దేశ ద్రోహం కేసును 2021 జూన్‍లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ సమయంలో వినోద్ దువా నేరుగా సుప్రీంను ఆశ్రయించారు.

మార్చి 4 వరకు కస్టడీ

Manish Sisodia: 8 గంటల విచారణ తర్వాత ఆదివారం (ఫిబ్రవరి 26) ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అవకతవకలకు సిసోడియాకు సంబంధం ఉందన్న ఆరోపణలతో అరెస్ట్ చేసింది. సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఆయనను హాజరుపరిచింది. సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి ఆ కోర్టు అప్పగించింది. ఆ లిక్కర్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయినా దాని రూపకల్పన, అమలులో అవినీతి, అవకతవకలు జరిగాయని సీబీఐ, ఈడీ విచారణ చేస్తున్నాయి. సుమారు రూ.30కోట్ల లిక్కర్ లాబీ నుంచి చేతులు మారాయని సీబీఐ చెబుతోంది.

లిక్కర్ పాలసీని మధ్యవర్తులు, అమ్మకందారులు, అధికారులకు లబ్ధి చేకూరేలా రూపొందించడంలో దక్షిణాది (South Lobby) వ్యాపారులు, రాజకీయనేతల ప్రోత్బలం ఉందని, ఆ విషయంపై దృష్టి సారించినట్టు సీబీఐ స్పష్టం చేసింది.

ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ సహా సుమారు 12 మంది అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను కూడా గతంలో ప్రశ్నించింది సీబీఐ.

Manish Sisodia: మరోవైపు, సిసోడియా అరెస్టుపై ఆమ్ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేశారు. బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిందని ఆయన ట్వీట్ చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం