Manjummel Boys in Telugu: తెలుగులోనూ వస్తున్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఇదే
Manjummel Boys in Telugu: మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయనుండటం విశేషం.
Manjummel Boys in Telugu: మలయాళంలో ఈ ఏడాది రిలీజై సంచలన విజయం సాధించిన సినిమా మంజుమ్మెల్ బాయ్స్. ఇప్పటికే ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్లకుపైగా వసూలు చేసి.. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయబోతోంది మైత్రీ మూవీ మేకర్స్.
మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో..
మలయాళ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ ను తెలుగు, హిందీల్లోనూ డబ్ చేశారు. నిజానికి ఈ సినిమా శుక్రవారమే (మార్చి 15) తెలుగులో రిలీజ్ కానుందని భావించారు. అయితే తాజాగా ఓటీటీప్లేలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. మంజుమ్మెల్ బాయ్స్ మూవీ మార్చి 29న తెలుగులో రిలీజ్ కానుంది. పుష్ప మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది.
తెలుగులోనూ ఈ సినిమా ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహించి రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో రిలీజ్ తేదీని రెండు వారాలు వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ మధ్యే మరో మలయాళ సినిమా ప్రేమలు విషయంలోనూ ఇలాగే చేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను.. తెలుగులో రాజమౌళి కొడుకు కార్తికేయ మంచి ప్రమోషన్లతో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు.
ఆ సినిమా ఇప్పుడు గామి, భీమాలాంటి తెలుగు సినిమాల కలెక్షన్లను మించి వసూళ్లు సాధిస్తుండటం గమనార్హం. మరోవైపు మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కేరళతోపాటు ప్రపంచవ్యప్తంగా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. తెలుగులోనూ మంచి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రేమలు టీమ్ లాగే మంజుమ్మెల్ బాయ్స్ టీమ్ కూడా హైదరాబాద్ లో మూవీ ప్రమోషన్లు నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. అందులోనూ ఈ మధ్య మలయాళ సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో ఈ సర్వైవల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
ఏంటీ మంజుమ్మెల్ బాయ్స్ మూవీ?
మలయాళంలో సూపర్ హిట్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ ఓ సర్వైవల్ థ్రిల్లర్. 2006లో జరిగిన ఓ నిజజీవిత ఘటన ఆధారంగా రూపొందించారు. ఆ ఏడాది కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లారు. అందులో ఒక యువకుడు పొరపాటున ఓ లోతైన గుహలోకి జారి పడిపోతాడు.
ఆ తర్వాత అతని వెంట ఉన్న స్నేహితులు అతన్ని ఎలా కాపాడుతారన్నది ఈ మూవీ స్టోరీ. ఈ సినిమాకు చిదంబరం దర్శకత్వం వహించాడు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.
మూవీ రిలీజైనప్పటి నుంచీ వస్తున్న పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. గతంలో 2018 మూవీ సాధించిన రికార్డును మంజుమ్మెల్ బాయ్స్ బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. మరి ఈ మూవీ తెలుగులో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులు మాత్రం ఇంకా ఎవరూ కొనుగోలు చేయలేదు. మేకర్స్ భారీ మొత్తం డిమాండ్ చేస్తుండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది.