Ponniyin Selvan: బాహుబలి వల్లే పొన్నియిన్ సెల్వన్ సాధ్యమైంది: మణిరత్నం-director mani ratnam and vikram bout ponniyin selvan movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Director Mani Ratnam And Vikram Bout Ponniyin Selvan Movie

Ponniyin Selvan: బాహుబలి వల్లే పొన్నియిన్ సెల్వన్ సాధ్యమైంది: మణిరత్నం

Maragani Govardhan HT Telugu
Aug 20, 2022 06:07 AM IST

మణిరత్నం తెరకెక్కించి పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం సెప్టెంబరు 30న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి చోళ చోళ అనే పాట విడుదలైంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను మనో, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ పాట విడుదల కార్యక్రమం హైదారబాద్‌లో జరిగింది.

పొన్నియిన్ సెల్వన్ టీమ్
పొన్నియిన్ సెల్వన్ టీమ్ (Twitter)

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి చోళ చోళ అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మణిరత్నం.. ఇలాంటి సినిమాలను తీయడంలో రాజమౌళి దారి చూపించారని స్పష్టం చేశారు.

"చిరంజీవి సహా చాలా మందికి ఈ సమయంలో కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకనేది త్వరలోనే తెలుస్తుంది. రాజమౌళికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కథల్నీ ఎలా తీయాలో చెబుతూ తలుపులు తెరిచి మా అందరికీ దారి చూపించారు. బాహుబలి వల్లే పొన్నియిన్ సెల్వన్ సాధ్యమైంది." అని మణిరత్న స్పష్టం చేశారు.

ఈ చిత్రంలో హీరోగా చేసిన విక్రమ్ మాట్లాడుతూ.. “మణిరత్నంతో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రావణ్ తర్వాత ఈ సినిమాలో నటించా. శంకర్, మణిరత్నం సినిమాల్లో నటించాకే రిటైర్మెంట్ కావాలని ముందే అనుకున్నా. మణిరత్నం సినిమాలో ఇలాంటి మంచి పాత్రను చేయడం నాకు దక్కిన ఓ భాగ్యంగా భావిస్తున్నా" అని తెలిపారు. కార్తి మాట్లాడుతూ.. “నాకు చాలా ప్రత్యేకమైన వేదిక ఇది. మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా నా కెరీర్‌ను మొదలుపెట్టా. ఎంతోమంది చేయాలనుకున్న పాత్రను చేసే అవకాశం నాకు వచ్చింది. ఒక్కో పాత్రకు ఒక్కో లక్ష్యం ఉంటుంది. సినిమా చివర్లో ఆ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే ఆసక్తికరంగా సాగుతుంది. నేను పాత తెలుగు భాషలో డబ్బింగ్ చెబుతున్నా” అని అన్నారు.

పదో శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, రెహమాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. సెప్టెంబరు 30 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం