AP Cabinet Portfolio List : ఏపీ మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. పవన్ కల్యాణ్ కు పంచాయతీరాజ్ శాఖ(డిప్యూటీ సీఎంగా) దక్కింది. ఐటీ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చూడనున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ కు ఛాన్స్ దక్కింది. వంగలపూడి అనితకు హోంశాఖ దక్కింది. గొట్టిపాటి రవి కుమార్ కు విద్యుత్ శాఖ బాధ్యతలను చూడనున్నారు.
టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి ఈసారి వ్యవసాయశాఖ దక్కింది. కొల్లు రవీంద్రకు మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ ఖరారైంది. జనసేన నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్,.. పౌరసరఫరాల శాఖ బాధ్యతలు చూడనున్నారు. 2014లో చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్ శాఖ బాధ్యతలు చూసిన నారాయణకు.. మరోసారి అదే శాఖ దక్కింది.
బీజేపీ నుంచి గెలిచిన సత్య కుమార్ యాదవ్ .. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు చూడనున్నారు. నిమ్మల రామనాయుడుకు నీటి పారుదల శాఖ ఖరారైంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరి గెలిచిన ఆనం రాంనారాయణరెడ్డికి దేవాదాయశాఖను కేటాయించారు.
కీలకమైన ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్ కు అప్పగించారు. అనగాని సత్యప్రసాద్ .. రెవెన్యూ శాఖ బాధ్యతలు చూడనున్నారు. ఇక వైసీపీ నుంచి చివర్లో బయటికి వచ్చి నూజివీడు నుంచి గెలిచిన కొలుసు పార్థసారథికి హౌసింగ్ శాఖ దక్కింది. జనసేన నుంచి గెలిచిన కందుల దుర్గేశ్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఖరారైంది.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. అతిపెద్ద భాగస్వామ్యపక్షంగా టీడీపీ ఉంది. ఇక జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం జనసేన, బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కాయి.