Pattisam Pipeline: ఇటుకలకోట వద్ద పగిలిపోయిన పట్టిసీమ పైప్‌లైన్‌, వృధాగా పోతున్న గోదావరి జలాలు-pattiseema pipeline burst at itukalakota godavari water going to waste ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pattisam Pipeline: ఇటుకలకోట వద్ద పగిలిపోయిన పట్టిసీమ పైప్‌లైన్‌, వృధాగా పోతున్న గోదావరి జలాలు

Pattisam Pipeline: ఇటుకలకోట వద్ద పగిలిపోయిన పట్టిసీమ పైప్‌లైన్‌, వృధాగా పోతున్న గోదావరి జలాలు

Sarath chandra.B HT Telugu

Pattisam Pipeline: పట్టిసీమ పైప్‌లైన్‌ పగిలిపోవడంతో గోదావరి జలాలు వృధా అవుతున్నాయి. రెండు రోజులు క్రితం పట్టిసీమ నుంచి కృష్ణా నదికి లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. తాజాగా పైప్‌లైన్‌ వాల్‌ పగిలిపోవడంతో నీరు ఎగజిమ్ముతోంది.

పట్టిసీమపైప్‌లైన్‌ పగలడంతో ఎగజిమ్ముతున్న నీరు

Pattisam Pipeline: పట్టిసీమ పైప్ లైన్లు పగలడంతో గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గోదావరి నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్‌ ఏర్పాటు చేశారు. గోదావరి నది నుంచి భారీ మోటర్లతో నీటి పైకితోడి వాటిని పైప్‌లైన్ల ద్వారా డెలివరీ ఛానల్‌కు మళ్లిస్తారు. గోదావరి నది నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ కుడి కాల్వ వద్ద ఛానల్ ప్రారంభం అవుతుంది.

శుక్రవారం ఉదయం పైప్‌లైన్లలో ఒకదానిలో ఒత్తిడి పెరిగి వాల్వులు పగిలిపోయాయి. గత ఐదేళ్లుగా పట్టిసీమ లిఫ్ట్‌ స్కీమ్ నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోలేదు. మొదటి నాలుగేళ్ల మోటర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. గత ఏడాది నీటి కొరతతో వాటిని కొద్ది రోజులు వినియోగించారు.

ఈ ఏడాది ప్రాజెక్టులలో నీరు పూర్తిగా ఎండిపోవడంతో పట్టిసీమ మోటర్లతో నీటి తరలింపు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు మోటర్లను ప్రారంభించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటిని లిఫ్ట్ చేయడం లేదు. దశల వారీగా మోటర్ల సామర్ధ్యం పెంచుకుంటూ వెళ్లాలని ప్రణాళిక రూపొందించారు. అయితే పైప్‌లైన్‌ ధ్వంసం కావడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది.

మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటర్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు. దాదాపు 50-60అడుగుల ఎత్తుకు నీరు ఎగజిమ్ముతోంది.