CM YS Jagan: రామ్‌కో పరిశ్రమ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు-cm ys jagan inaugurated ramco cement factory at kolimigundla in nandyal district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Ys Jagan: రామ్‌కో పరిశ్రమ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు

CM YS Jagan: రామ్‌కో పరిశ్రమ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 01:52 PM IST

ramco cement factory at kolimigundla: నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. కొలిమిగుండ్ల వద్ద రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు.

రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్‌
రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్‌ (twitter)

cm ys jagan inaugurated ramco cement factory: నంద్యాల జిల్లా పారిశ్రామిక పథంలో పయనిస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పలు కంపెనీలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో జయజ్యోతి, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉండగా తాజాగా రూ.1,790 కోట్లతో రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమను నెలకొల్పిందని వెల్లడించారు. ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి...కొలిమిగుండ్ల వద్ద రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని సగర్వంగా చెప్పేందుకు రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ స్థాపనే ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

"2019లోనే రామ్ కో ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి రావటం... కొద్ది నెలల కాలంలోనే ప్రారంభించడం , 30 నెలల్లోనే సిమెంట్‌ ఉత్పత్తికి రెడీ అవ్వడం గొప్ప మార్పునకు చిహ్నమని ముఖ్యమంత్రి తెలిపారు. 'కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా.. మన ప్రాంతంలోనే ఉద్యోగాలు లభించినట్లయితే ఎంత మంచి జరుగుతుందో మనకు తెలిసిన విషయమే. మనకు లైమ్‌స్టోన్‌ మైన్స్‌ ఉండి కూడా గతంలో ఎటువంటి పరిశ్రమలు రాని పరిస్థితులను చూశాం. మన ప్రభుత్వం వచ్చాక దాదాపు 2 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే రామ్‌కో పరిశ్రమను స్థాపించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్‌ ఫేస్‌–1 కింద తయారై.. ఆర్గానిక్‌ గ్రోత్‌లో పెరుగుతూ పోతుంది. విస్తరణ జరిగే కొద్దీ ఇంకా మెరుగైన మౌలిక సదుపాయాలు వస్తాయి. చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా మంచి జరుగుతంది. పరిశ్రమ విస్తరణ జరిగే కొద్దీ 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు కచ్చితం ఇవ్వాలని చట్టం చేశాం" అని వెల్లడించారు.

దాదాపు రూ.2500 కోట్ల పెట్టుబడితో మొదటి ఫేజ్‌లో 1000 మందికి ఉద్యోగాలు కల్పించే మంచి కార్యక్రమం జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు రామ్‌కో పరిశ్రమ వేగంగా స్థాపించడమే ఒక ఉదాహరణ అన్న ఆయన.... ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు వల్లే ఇది సాధ్యమైందన్నారు. రామ్ కో నిర్మాణ సమయంలో ఏవిధంగా సపోర్టు చేశామో.. ప్లాంట్‌ నడిపే సమయంలో కూడా అదే రకమైన సహాయ, సహకారాలు ఇవ్వాలని ప్రతీ ఒక్కరినీ కోరుతునానని చెప్పారు. మనమిచ్చే మద్దతునే ప్లాంట్‌ను మరింతగా విస్తరించాలనే భావన వస్తుందని తెలిపారు.

గ్రీన్ కో ప్రాజెక్ట్ పెట్టుబడుల అంశాన్ని కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. గ్రీన్‌కో ప్రాజెక్టు వారు తలపెట్టిన 5400 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించి సోలార్, విండ్, పంప్‌ స్టోరేజీ కింద నిర్మిస్తున్న రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు కొద్ది నెలల కిందటే శంకుస్థాపన చేశామని... ఫలితంగా కర్నూలు జిల్లాలో 2600 ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. దాదాపు 3–4 సంవత్సరాల్లో గ్రీన్ కో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు.

2021–22లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధిక గ్రోత్‌ రేట్‌ (11.43 శాతం) సాధించడం మరో గొప్ప మార్పు అన్నారు సీఎం జగన్. గ్రాసిమ్ ఇండ్రస్ట్రీస్, అపాచీ షూ మేకింగ్, టీసీఎల్ ప్యానల్స్, ఏటీసీ టైర్స్ వంటి కంపెనీలతో అనేక ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.

IPL_Entry_Point