CM Jagan to Srikakulam: రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సిఎం జగన్-cm jagan will visit srikakulam district tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan To Srikakulam: రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సిఎం జగన్

CM Jagan to Srikakulam: రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సిఎం జగన్

Sarath chandra.B HT Telugu

CM Jagan to Srikakulam: ఏపీ సిఎం జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలను ప్రారంభిస్తారు.

ఉద్దానంలో పర్యటించనున్న సిఎం జగన్

CM Jagan to Srikakulam: ఏపీ సిఎం వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో సిఎం పాల్గొంటారు. పలాసలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురం చేరుకుంటారు, అక్కడ డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు, ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు, అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఉద్దానం కిడ్నీ రోగుల వేతలు పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో పనులకు వ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు.. మూడు దశాబ్దాల సమస్యకు చెక్‌ పెడుతూ శాశ్వత పరిష్కారం చూపారు. రూ.742 కోట్లతో వైఎస్సార్‌ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, రూ.85 కోట్లతో 200 పడకల డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రిని నిర్మించారు. ఈ రెండింటినీ గురువారం సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్యకు ముగింపు పలు అభివృద్ధి పనుల్ని సిఎం జగన్ ప్రారంభించనున్నారు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. స్థానిక జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే ఉద్దానంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

కిడ్నీ వ్యాధులతో ఇప్పటికే 15వేల మంది చనిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి. సాధారణంగా రక్తంలో సీరం క్రియాటిన్‌ 1.2 మిల్లీగ్రామ్‌/డెసీలీటర్‌ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పనిచేయడంలేదని అర్థం.

ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటిన్‌ లెవెల్స్‌ చాలామందిలో 25 మిల్లీగ్రామ్‌/డెసీలీటర్‌ మేరకు ఉంది. క్రియాటినిన్‌ 5 దాటితే డయాలసిస్‌ తప్పనిసరి అవుతుంది.వీరంతా చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. వారానికి రెండు సార్లు కూడా వెళ్లేవారున్నారు. ఇలా రోజుకు 500కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రవాణా, వైద్య ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. డబ్బుల్లేక, వైద్యం చేసుకోలేక ప్రాణాలను కోల్పోయేవారు.

ప్రతిపక్షనేత హోదాలో కిడ్నీ బాధితులకు సాంత్వన కలిగిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు పెన్షన్‌ రూ.10వేలు చెల్లిస్తున్నారు. వంశధార జలాలను ఉద్దానానికి తీసుకొచ్చారు. దశాబ్దాల సమస్య పరిష్కారం చూపే ప్రయత్నం జరుగుతోంది.