AP Bifurcation Issues : విభజన చట్టంలోని అంశాలపై కేంద్రం కీలక సమావేశం.. ఎప్పుడంటే?
AP Bifurcation Act : ఏపీ విభజన చట్టం అమలుపై కేంద్ర హోం శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. రాజధానికి కేంద్ర సహకారం, విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని అంశాలపైనా భేటీలో చర్చించే అవకాశం ఉంది.
విభజన చట్టంలోని అంశాలను కేంద్రం అమలు చేయలేదని.. తెలుగు రాష్ట్రాలు చెబుతూ ఉన్నాయి. చట్టంలోని మెజార్టీ అంశాలు అమలుకు నోచుకోలేదని కామెంట్స్ చేస్తున్నాయి. చట్టంలోని చాలా అంశాలు అమలు అయ్యాయని కేంద్ర హోంశాఖ చెబుతూ ఉంది. మరికొన్ని అమలు దశలో ఉన్నాయని పేర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఏపీ విభజన చట్టం అమలుపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం కానుంది.
పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశంలో చర్చించనుంది. తెలుగు రాష్ట్రాల నడుమ ఉన్న ఆర్థికపరమైన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే కేంద్రం పేర్కొంది. అయితే మూడు రాజధానుల అంశంపై ఏం అంటారో చూడాలి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్భల్లా నేతృత్వంలో జరిగే ఈ భేటీకి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు ఛైర్మన్ సహా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
విభజన చట్టంలోని అంశాల అమలు పురోగతిని ఎప్పటికప్పుడూ కేంద్ర హోంశాఖ సమీక్ష చేస్తోంది. ఇప్పటివరకు సుమారు 25 సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మరోసారి ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశం అవుతోంది. సమావేశం ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నాయి. కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ప్రకటన చూసుకుంటే.. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవిగా ఉన్నాయి. మరో ఏడు ఏపీకి సంబంధించినవే చర్చకు రానున్నాయి.
ఇరు రాష్ట్రాలకు చెందిన ఏడు అంశాలపై చర్చ జరగుతుంది. ప్రభుత్వ కంపెనీల కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ విభజన, బ్యాంకుల్లో నగదు, బ్యాలెన్స్ విభజన, 2014- 15 రైస్ రాయితీ విడుదలపై చర్చ ఉంటుంది. పన్ను ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ, ఏపీలో వెనకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంటుపై చర్చ జరగనుంది.
సంబంధిత కథనం