TTD FCRA License: టీటీడీ ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్దరణ-central home ministry has renewed fcra approvals for ttd with jai ram ramesh tweet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Central Home Ministry Has Renewed Fcra Approvals For Ttd With Jai Ram Ramesh Tweet

TTD FCRA License: టీటీడీ ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్దరణ

HT Telugu Desk HT Telugu
Mar 29, 2023 10:11 AM IST

TTD FCRA License: తిరుమల తిరుపతి దేవస్థానానికి విదేశీ విరాళాల స్వీకరణ అనుమతి మంజూరు చేయకపోవడంతో జరిమానా కట్టాల్సి రావడం వివాదాస్పదం కావడంతో కేంద్రం స్పందించింది. టీటీడీకి ఐదేళ్ల పాటు ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరించింది. టీటీడీకి అనుమతులివ్వకపోవడంపై జైరామ్‌ రమేష్ ట్వీట్ చేయడంతో దుమారం రేగింది.

టీటీడీకి ఎఫ్‌సిఆర్‌ఏ అనుమతుల పునరుద్ధరణ
టీటీడీకి ఎఫ్‌సిఆర్‌ఏ అనుమతుల పునరుద్ధరణ

TTD FCRA License: విదేశీ విరాళాల స్వీకరణ అనమతులు పునరుద్దరించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థాన భారీగా జరిమానా చెల్లించాల్సి రావడంపై కేంద్రం స్పందించింది. టీటీడీకి హుండీల ద్వారా విదేశీ విరాళాలకు లెక్కలు చెప్పాలనే నిబంధన వివాదాస్పదం కావడంతో లైసెన్స్‌ పునరుద్ధరించలేదు. మరోవైపు లైసెన్స్ లేకుండా టీటీడీ విరాళాలు స్వీకరించడంతో కేంద్రం జరిమానా విధించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్‌ చేసుకోని కారణంగా కేంద్ర హోం శాఖ టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా విధించింది.

ట్రెండింగ్ వార్తలు

టీటీడీకి జరిమానా విధించిన వ్యవహారంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని కారణంగా శ్రీవారికి విదేశీ భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీ రూ.30కోట్ల మేరకు టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ కాకుండా ఎస్‌బీఐ వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. లైసెన్స్‌ రెన్యువల్‌ కాకపోవడంతో విదేశీ నగదు మారకానికి ఆర్‌బీఐ అనుమతించలేదు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన హుండీలో వేసే నగదు లేదా ఖరీదైన లోహాలు, ఇతర వస్తువులకు భక్తులు ఎలాంటి లెక్కలూ చెప్పాల్సిన పనిలేదని టీటీడీ వివరణ ఇచ్చినా విదేశీ నగదుపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. హుండీల్లో విదేశీ నగదు వేసే అజ్ఞాత భక్తుల వివరాలు తెలియ చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పిస్తుంటారని, వాటిలో ఆయా దేశాల కరెన్సీ కూడా ఉంటుందని వివరణ ఇచ్చారు.

గతంలో విదేశీ నగదును ఆర్‌బీఐ ద్వారా టీటీడీ భారత కరెన్సీలోకి మార్చుకునేది. 2018 తర్వాత అలా మారకానికి ఆర్‌బీఐ అంగీకరించడం లేదు. విదేశీ కరెన్సీని ఎస్‌బీఐ టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ చేయడానికీ ఒప్పుకోవడం లేదు. ఫలితంగా 2018 నుంచీ ఇప్పటి వరకూ సుమారు రూ.30 కోట్ల మేరకు విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో జమ కాకుండా ఎస్‌బీఐ వద్ద ఉండిపోయింది.

రెన్యువల్ కాని లైసెన్స్….

విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించడానికి టీటీడీ కేంద్ర హోం శాఖ నుంచి ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కింద లైసెన్సు పొందింది. 2018 వరకు విదేశీ కరెన్సీ మారకానికి ఆర్‌బీఐ అనుమతించేది. ఎస్‌బీఐ కూడా విదేశీ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ చేసేది. 2018లో లైసెన్సు గడువు ముగిసింది. రెన్యువల్‌పై టీటీడీ దృష్టి సారించలేదు. కేంద్ర హోం శాఖలోని ఎఫ్‌సీఆర్‌ఏ విభాగం 2019లో దీన్ని గుర్తించింది.

టీటీడీకి లైసెన్సు లేకపోయినా టీటీడీ విదేశీ విరాళాలు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.14 కోట్ల జరిమానా విధించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి 2020లో చేసిన సవరణల ప్రకారం, విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు వినియోగించకూడదు. టీటీడీ వడ్డీ వినియోగించుకోవడంపై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ ఆలస్యంగా అందజేసిన ఆదాయ వివరాలను కూడా సక్రమ ఫార్మాట్‌లో ఇవ్వలేదని మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీంతో జరిమానా మొత్తం రూ.4.33 కోట్లకు చేరుకుంది.

జైరామ్‌ రమేష్ ట్వీట్‌తో వివాదం….

టీటీడీకి జరిమానా విధించడంపై కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీకి జరిమానా విధించడాన్ని కాంగ్రెస్ నేత తప్పు పట్టారు. దీంతో ఇది రాజకీయ వివాదంగా మారింది. మరోవైపు కేంద్ర హోంశాఖ ఎఫ్‌సీఆర్‌ఏ విభాగానికి రూ.3 కోట్ల జరిమానా చెల్లించామని టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

విదేశీ కరెన్సీని విరాళాలుగా స్వీకరించేందుకు కేంద్రం నుంచి టీటీడీ పొందిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును 2018కి ముందే నిబంధనలు పాటించడం లేదనే కారణాలతో రద్దు చేశారని తెలిపారు. ఐదేళ్లలో టీటీడీకి హుండీ ద్వారా దాదాపు రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ వచ్చిందని, ఈ నగదు మార్పిడి కోసం ప్రయత్నించగా, ఈ నగదు ఎవరిచ్చారు.. ఎలా తీసుకున్నారంటూ ఆర్‌బీఐ ప్రశ్నించిందని వివరించారు. గుర్తుతెలియని భక్తులు హుండీలో వేసే కానుకలు కావడంతో ఎవరిచ్చారో గుర్తించడం సాధ్యం కాదన్నారు.

దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రం విషయంలో కేంద్ర హోంశాఖ అనుమతులు మంజూరు చేయకపోవడం, జరిమానా చెల్లించాల్సి రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్రం దిద్దబాటు చర్యలు చేపట్టింది. ఆగమేఘాలపై అనుమతులు మంజూరు చేసింది. 2020 నుంచి లైసెన్స్‌ పునరుద్ధిస్తున్నట్లు టీటీడీకి సమాచారం పంపింది.

IPL_Entry_Point