Revanth Reddy Padayatra:వైఎస్ బాటలో రేవంత్ రెడ్డి...! అందుకే పాదయాత్ర వేదిక మారిందా..?
04 February 2023, 11:55 IST
- Haath Se Haath Jodo Yatra: రేవంత్ రెడ్డి పాదయాత్రకు సర్వం సిద్ధమవుతోంది. అయితే మొదట భద్రాచలం అనుకున్నప్పటికీ... ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ ములుగుకి షిప్ట్ అయింది. దీంతో ఖమ్మం జిల్లా కేడర్ కాస్త నిరాశకు గురైనప్పటికీ... ప్లేస్ ఛేంజ్ కావటంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి
Revanth Reddy Haath Se Haath Jodo Yatra : టీ కాంగ్రెస్... ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యే పనిలో పడింది. ఓవైపు అగ్రనేత రాహుల్ చేపట్టిన జోడో యాత్ర స్ఫూర్తితో... రాష్ట్రంలోనే హాత్ సే హాత్ జోడో చేపట్టనుంది. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టబోయే ఈ యాత్రకు నేతలు, కార్యకర్తలు అంతా సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ యాత్ర రాములోరు కొలువైన భద్రాచలం నుంచి ప్రారంభించాలని అనుకున్నప్పటికీ... నిర్ణయం మారింది. ఇదీ కాస్త ములుగుకి షిప్ట్ అయిపోయింది. అయితే ఈ నిర్ణయం వెనక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వస్తోంది. నాడు వైఎస్ తరహాలోనే... నేడు రేవంత్ రెడ్డి కూడా... సెంటిమెంట్ ను నమ్మి ములుగు నుంచి నడవాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
చెవేళ్ల నుంచి వైఎస్..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి... చాలా ప్రభుత్వ కార్యక్రమాలను చెవేళ్ల నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. ప్రతిపక్ష నాయకుడిగా తన పాదయాత్రలో భాగంగా తొలి అడుగుపడింది కూడా చేవెళ్లలోనే..! నాడు కాంగ్రెస్ లో ఉన్న సబితా ఇంద్రారెడ్డిని చెవేళ్ల చెల్లెమ్మెగా పిలిచేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చేవెళ్లే చెల్లెమ్మె అనగానే టక్కున సబితా ఇంద్రారెడ్డి గుర్తొచ్చే పరిస్థితి. ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఇక్కడ్నుంచి ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అవుతుందని వైఎస్ఆర్ భావించేవారు. ఇక సీన్ కట్ చేస్తే... తాజాగా రేవంత్ రెడ్డి ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేయనున్నారు. నిజానికి భద్రాచలం అని దాదాపు ఖరారు కాగా.. చివర్లో నిర్ణయం మారింది. అయితే దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ...ఓ ఆసక్తికరమైన చర్చ మాత్రం జరుగుతోంది.
ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క ఎమ్మెల్యే ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డితో కలిసి పని చేసిన సీతక్క... ఆ తర్వాత ఆయనతో పాటే కాంగ్రెస్ లోకి వచ్చారు. ప్రస్తుతం హస్తం పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. అందులోనూ రేవంత్ రెడ్డి వర్గంగా పేరుంది. ఇక సీతక్క - రేవంత్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపైమరొకరు ప్రేమ, అప్యాయతను చాటుతుంటారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నుంచే ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భద్రాచలం నుంచి ములుగుకి షిఫ్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వనదేవతలైన సమక్క - సారక్కలకు పూజలు చేసిన అనంతంర యాత్ర ప్రారంభం కానుంది.